సొంత సీటుపై కెసిఆర్ దృష్టి: గజ్వెల్ అభివృద్ధి అథారిటీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తన నియోజకవర్గం గజ్వేల్ సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించారు. అందులో భాగంగానే మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి అథారిటీ ఏర్పాటైంది. ఈ అథారిటీకి ఓ ప్రత్యేక అధికారిని కూడా నియమించనున్నారు. దీనికి జిల్లా కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వుల్లో చెప్పారు.
రాష్ట్ర ప్రణాళిక శాఖ ఈ అథారిటీకి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు. గజ్వేల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటంతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలను ఒకే చోటకు తీసుకురావటం, కనీస మౌలిక సదుపాయాలైన సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్లు, నీటి సరఫరా పథకాలు, విద్యుదీకరణ, వీధి దీపాల వంటి పను లు చేపట్టాల్సి ఉంటుంది.
నైపుణ్యాలను మెరుగుపర్చటం ద్వారా వినూత్న రీతిలో జీవనోపాధి కార్యక్రమాలు చేపట్టడం, ఉత్పాదకత పెంచేం దుకు చర్యలు, ఉపాధి అవకాశాల కల్పన కోసం శిక్షణ వంటి చర్యలు చేపట్టనున్నారు. నిర్దేశిత లక్ష్యాలను అందుకునేందుకు వీలుగా వైద్యం, విద్యా రంగాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. స్థాయిలో ప్రయోజనాలు పొందేందుకు వీలుగా సహజవనరులైన భూమి, భూగర్భ జలాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు.
స్థిరమైన వ్యవసాయ రంగాభివృద్ధి కోసం నీటి పొదుపునకు సంబంధించి పనులు, పథకాలు చేపట్టనున్నారు. ముఖ్యంగా ఉపాధి అవకాశాల కల్పన కోసం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రతిపాదించారు. ఆర్థిక శాఖతో సంప్రదించి ఈ అథారిటీకి అవసరమైన నిధులు, సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు.