హోదా వద్దని వైవీరెడ్డితో జగనే నివేదిక ఇప్పించారు: గాలి, మోడీ ట్విట్టర్లోనైనా..
తిరుపతి/ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డితో నివేదిక ఇప్పించారని తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు.
అన్యాయం జరిగిందని ఇప్పుడు ఆందోళన చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, సిపిఐ కలిసి వేధిస్తున్నాయని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జదగన్మోహన్ రెడ్డిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఇచ్చే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ కనీసం ట్విట్టర్లోనైనా స్పందించడం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడూ కూడా నోరు మెదపడం లేదని ఆయన ఆక్షేపణ తెలిపారు.
ఇదిలావుంటే, పార్టీ ఉనికి కోసమే ఢిల్లీలో వైఎస్ జగన్ దీక్ష చేశారని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. ఏపీకి అన్యాయం జరిగినప్పుడు జగన్ ఎప్పుడూ మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు జగన్కు లేదని పల్లె అన్నారు.
మునికోటి ఆత్మహత్య బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా రాష్ట్రానికి వచ్చి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తారని మంత్రి పల్లె తెలిపారు.