గాలి పెళ్లికి చంద్రబాబును పిలిస్తే: మరి జగన్ ?
అమరావతి: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె బ్రహ్మిణి పెళ్లికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానిస్తారని వార్తలు రావడంతో గాలి అభిమానులతో సహ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ మొదట స్థాపించిన సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సందర్బంలో అనంతపురం జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నాయకులు గాలి జనార్దన్ రెడ్డికి పరోక్షంగా సహకరించారని ఆ జిల్లా ప్రజలు చెప్పిన విషయం తెలిసిందే.
తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత గాలి ఆయనకు దగ్గర అయ్యారు. అనంతరం గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ వ్యాపారంలో తిరుగులేని వ్యాపారవేత్త అయ్యారు. ఆయన బళ్లారిలో ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తారని అందరూ ఊహించారు.
అయితే గాలి తన అనుచరులను కర్ణాటకలో బీజేపీ తరపున పోటీ చేయించి గెలిపించుకున్నారు. తరువాత గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలో బీజేపీ ఎంఎల్ సీ అయ్యారు. అప్పటి నుంచి కర్ణాటక రాజకీయా్ల్లో గాలి జనార్దన్ రెడ్డి చక్రం తిప్పారు.
గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం నాయకులతో సహ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. బళ్లారి జిల్లాలోని మైనింగ్ వ్యాపారులు సైతం గాలికి వ్యతిరేకంగా పావులుకదిపారు.
మొత్తం మీద గాలి జనార్దన్ రెడ్డి జైలుకు వెళ్లేందుకు ప్రధాన కారణం టీడీపీ చేసిన ఆందోళనలే అని అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. అక్రమాలు చేసే వారు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని చంద్రబాబు నాయుడు అనేక సార్లు చెప్పారు.
బీజేపీలో ఓ వెలుగు వెలిగిన గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ, టీడీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములైనాయి. ఈ నేపధ్యంలోనే గాలి తన కుమార్తె వివాహానికి చంద్రబాబును ఆహ్వానించడానికి సిద్దం అయ్యారని సమాచారం.
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పరిస్థితి ఏంటి ?
గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె పెళ్లికి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ఎలా స్పంధిస్తారు ? అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో గాలి జనార్దన్ రెడ్డి ఆయన్నఎన్నో సార్లు కలుసుకున్నారు.
రాజకీయాలతో పాటు వ్యాపారాల విషయంలో వైఎస్ఆర్ సలహాలు తీసుకున్నారని తెలిసింది. ఇప్పుడు గాలి సీఎం చంద్రబాబును తన కుమార్తె పెళ్లికి ఆమహ్వానిస్తే జగన్ గాలి కుమార్తె పెళ్లికి హాజరవుతారా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రాజకీయాలు వేరు, శుభకార్యాలు వేరు అని జగన్ సర్దుకున్నా చంద్రబాబు నాయుడు మాత్రం ఈ పెళ్లికి వస్తారా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద చంద్రబాబు, జగన్ ను ఇద్దరినీ గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె పెళ్లికి ఆహ్వానిస్తారని ఆయన అభిమానులు అంటున్నారు.