మైనింగ్ రారాజు గాలి కుమార్తె పెళ్లికి కడప కింగ్ డుమ్మా !
కడప/బెంగళూరు: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహానికి ఆంధ్రప్రదేశ్ శాసన సభలోని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్ డుమ్మా కొట్టారు. ఆయన ఈ శుభకార్యానికి హాజరు కాలేదని వైఎస్ఆర్ సీపీ నాయకులు తెలిపారు.
బెంగళూరు నగరంలోని ప్యాలెస్ మైదానంలోని 36 ఎకరాల్లోని ప్రాంగణంలో గాలి జనార్దన్ రెడ్డితన కుమార్తె బ్రహ్మిణి వివాహం రంగరంగ వైభంగా నిర్వహిస్తున్నారు. తనకు చిరకాల మిత్రుడు అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ తో పాటు ఆపార్టీ నాయకులను తన కుమార్తె పెళ్లికి గాలి జనార్దన్ రెడ్డి ఆహ్వానించారు.
జగన్ గాలి ఇంట జరిగే పెళ్లికి హాజరౌతారని జోరుగా ప్రచారం జరిగింది. బెంగళూరులో ఉంటున్న వైఎస్ఆర్ అభిమానులు గాలి ఇంట జరిగే పెళ్లికి వెళ్లి జగన్ ను కలుసుకోవాలని మంగళవారం రాత్రి బెంగళూరు ప్యాలెస్ మైదానంలోకి వెళ్లారు. అయితే జగన్ రాలేదని తెలుసుకుని వెనుతిరిగారు.
జగన్ ఎందుకు పెళ్లికి రాలేదు అనే విషయంపై మాట్లాడటానికి గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు నిరాకరించారు. మొత్తం మీద జగన్ పెళ్లికి వస్తారని ఎదురు చూసిన గాలి, ఆయన అభిమానులు చివరి నిమిషయంలో షాక్ కు గురైనారు. జగన్ ఎందుకు పెళ్లికి రాలేదు ? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.