స్టీల్ ప్లాంట్ నేను కడతా...లేదంటే నా డబ్బులు తిరిగి ఇచ్చేయాలి:గాలి జనార్థన్ రెడ్డి
Recommended Video
కర్ణాటక:కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ఆందోళనలు ఉధృతమౌతున్న నేపథ్యంలో కర్ణాటక బిజెపి నేత గాలి జనార్థన్ రెడ్డి స్పందించారు. ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఇదే విషయమై ఆయన మాట్లాడారు.
తాను బ్రహ్మణీ స్టీల్స్ కోసం ఇప్పటి వరకూ దాదాపు 1350 కోట్లు ఖర్చు చేశానని, కాబట్టి స్టీల్ ప్లాంట్ పనులు తనకే ఇవ్వాలని గాలి జనార్థన్ రెడ్డి కోరారు. తనకు అనుమతిస్తే రెండేళ్లలోనే స్టీలు ప్లాంట్ కడతా అన్నారు. అయితే కేంద్రం లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరుగా స్టీల్ ప్లాంట్ పెట్టినా తనకు అభ్యంతరం లేదన్నారు. అలాగే ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ పనులు ఇతరులకు అప్పగిస్తే తాను పెట్టిన పెట్టుబడి డబ్బు తిరిగి ఇచ్చేయాలని గాలి జనార్థన్ రెడ్డి డిమాండ్ చేశారు.
నివేదిక...తప్పు
కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మించడం సాధ్యం కాదంటూ మెకాన్ సంస్థ నివేదిక ఇవ్వడాన్ని బిజెపి నేత గాలి జనార్ధన్ రెడ్డి తప్పు బట్టారు. కడప జిల్లాలో స్టీలు ప్లాంటు స్థాపించాలనే డిమాండ్తో జరుగుతున్న పోరాటాలను మీడియా ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు. 2007, జూన్ 10న జమ్మలమడుగులో బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరిట స్టీలు ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని గాలి జనార్దనరెడ్డి గుర్తు చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమకు అన్ని అవకాశాలు ఉన్నాయని అదే మెకాన్ సంస్థ గతంలో నివేదిక ఇచ్చిన విషయాన్నిఆయన గుర్తు చేశారు. ఇప్పుడు అదే సంస్థ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఫీజుబిలిటీ కాదని చెప్పడంపై ఆయన మండిపడ్డారు.
అనుమతి ఇస్తే...రెండేళ్లలో
ఈ స్టీలు ప్లాంటు ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా లక్ష మందికిపైగా ఉపాధి లభిస్తుందని, అందుకే దివంగత సీఎం వైఎస్ఆర్ను తాను స్టీలు ప్లాంటు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరినట్టు గాలి తెలిపారు. ప్రభుత్వం స్టీలు ప్లాంట్ నిర్మాణానికి తనకు అనుమతి ఇస్తే రెండేళ్లలో ఫ్యాక్టరీ నిర్మించి చూపిస్తానని గాలి జనార్థన్ రెడ్డి అన్నారు. అది సాధ్యం కాకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఆ స్టీల్ ప్లాంటును స్వాధీనం చేసుకుని నిర్మాణం పూర్తి చేసుకోవచ్చన్నారు.
ఆ వివరాలు...అన్నీ ఇస్తా
ఇదే విషయమై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడానికి, చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కడపలో స్టీలు ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు తనను పిలిస్తే వెంటనే వెళ్లి కడప బ్రాహ్మాణి స్టీల్స్కు సంబంధించిన అన్ని వివరాలు అందజేస్తానని గాలి జనార్థన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వమే అక్కడ ఫ్యాక్టరీని నిర్మించుకోవచ్చని గాలి జనార్థన్ రెడ్డి చెప్పారు.
నా డబ్బులు...తిరిగి ఇచ్చేయాలి
కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ గా స్టీల్ ప్లాంట్ నిర్మించినా తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. అయితే బ్రహ్మణీ స్టీల్స్ కోసం తాను ఇప్పటి వరకూ దాదాపు 1350 కోట్లు ఖర్చు చేసినందున ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం పనులు తనకే ఇవ్వాలన్నారు. అలాకాకుండా ఈ పనులను వేరేవారికి అప్పగిస్తే తాను పెట్టిన పెట్టుబడి తిరిగి ఇచ్చేయాలని గాలి జనార్థన్ రెడ్డి డిమాండ్ చేశారు.