జగన్ దీక్ష: ఎందుకో చెప్పాలని దేవినేని, 'రైతుల కోసం మొసలి కన్నీరు'
అమరావతి: కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చేపట్టిన మూడు రోజుల జలదీక్ష సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ దీక్ష ఎందుకో చెప్పాలంటూ టీడీపీ నేతలు నిలదీస్తున్నారు.
జగన్ దీక్ష ఎందుకో: మంత్రి దేవినేని
వైసీపీ అధినేత వైయస్ జగన్ చేపట్టిన దీక్ష ఎవరిని మోసం చేయడానికో చెప్పాలని ఏపీ మంత్రి దేవినేని డిమాండ్ చేశారు. నాడు వైయస్ చేసిన నిర్వాకంతో రాష్ట్రం నష్టపోయిందని, ఇప్పుడు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.
సీఎం చంద్రబాబు మండుటెండల్లో రాష్ట్రాభివృద్ధి కోసం తిరుగుతుంటే, జగన్ ఏసీ గదుల్లో ఉంటూ ఆరు నెలలకోసారి బయటకు వచ్చి దీక్షల పేరిట ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై బురద జల్లుతూ తన తండ్రి చేసిన పాపాలు కప్పిపుచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడని మంత్రి ఆరోపించారు.
కమిషన్ల కోసమే జగన్ తనకు చెందిన నేతలకు పాలమూరు-రంగారెడ్డి పనులు ఇప్పించుకున్నారని దుయ్యబట్టారు. ఈ విషయం బయటకు రావడంతో తాము అడుగుతున్నామని వైసీపీకి చెందిన ఎంపీని టీఆర్ఎస్లో చేర్చేశాడని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.
సమస్యలకు కారణం వైఎస్సే: గాలి
ప్రజలు మర్చిపోయిన తెలంగాణ అంశాన్ని లేవనెత్తింది వైఎస్ రాజశేఖరరెడ్డేనని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. జగన్ ఎవరికోసం దీక్ష చేస్తున్నారో స్పష్టత ఇవ్వాలన్నారు. రైతులపై జగన్ మొసలి కన్నీరుకారుస్తున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు. ఏపీ బీజేపీ ఇన్చార్జ్ సిద్దార్థ్ నాథ్ సింగ్ అసత్యాలను ప్రచారం చేస్తున్నారని అలా చేయడం దురదృష్టకరమని చెప్పుకొచ్చారు. రెవెన్యూ లోటుతో ఇబ్బంది పడుతోన్న ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
చంద్రబాబు రాజీనామా చేయాలి: నారాయణ
ఈనెల 17న ఢిల్లీ వెళ్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా సాధించుకుని తిరిగి రావాలని లేని పక్షంలో ఆయన పదవికి రాజీనామా చేయాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టికి చెందిన వారికి మంత్రి పదవి కావాలంటూ కేంద్ర పెద్దలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బేరమాడుతుంటే, చంద్రబాబు కేంద్ర పెద్దలకు కాళ్లొత్తుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని ఆయన డిమాండ్ చేశారు.