గాలి మాట: ఉండవల్లి వైసీపీలో చేరతారేమో?
హైదరాబాద్: ఇటీవలి కాలంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని తెగ పొడుగుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్ వైఖరి చూస్తుంటే, వైసీపీలోకి చేరేలా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు వ్యాఖ్యానించారు.
శనివారం మీడియాతో మాట్లాడుతూ జగన్ మాదిరే రాయలసీమ అభివృద్ధి చెందడం ఉండవల్లి అరుమ్ కుమార్కి ఇష్టం లేనట్టుందని విమర్శించారు. అందుకే పట్టిసీమ ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు.
నదుల అనుసంధానం దేశ చరిత్రలో లిఖించదగ్గ అంశమని కొనియాడారు. గోదావరి నీటిని కృష్ణానదికి తరలించి చరిత్రలో నిలిచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
పట్టిసీమ ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేయడాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ శుక్రవారం తప్పుబట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టు అవసరం లేదన్నారు. ముడుపుల కోసమే పట్టిసీమ ప్రాజెక్టు కడుతున్నారని ఆయన ఆరోపించారు.
పట్టిసీమ ప్రాజెక్టు పనులు పది శాతం కూడా పూర్తి కాలేదని చెప్పిన ఆయన, ఇలా అసంపూర్తిగా ఉన్న ఒక ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం ఎప్పుడూ జరగలేదన్నారు. పట్టిసీమకు, రాయలసీకు ఉన్న సంబంధం ఏంటని ఉండవల్లి సూటిగా ప్రశ్నించారు. రాయలసీమకు పప్పన్నం పెడుతుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని చంద్రబాబు అంటున్నారని... పప్పన్నం కాదు గన్నేరుపప్పు పెడుతున్నారని ధ్వజమెత్తారు.
కృష్ణానదిలోకి మళ్లించిన నీరు తాటిపూడి ఆయకట్టు నీరని పట్టిసీమ నీరు కాదని స్పష్టం చేశారు. పట్టిసీమ ప్రాజెక్టుకపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా పట్టిసీమ ఎందుకు తలపెట్టారని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.