ఇది మామూలే, మీరు చేశారుగా: పురంధేశ్వరికి గాలి కౌంటర్, ధర్మాన నిప్పులు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై ప్రశ్నించిన బీజేపీ నేత పురంధేశ్వరికి టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు బుధవారం కౌంటర్ ఇచ్చారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై ప్రశ్నించిన బీజేపీ నేత పురంధేశ్వరికి టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు బుధవారం కౌంటర్ ఇచ్చారు.
ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నేతలకు కూడా బీజేపీలో పదవులు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. పార్టీ మారడం గురించి చర్చ అనవసరమని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు మారడం సహజమే అన్నారు.
ప్రజలు దానిని అంగీకరిస్తూనే నేతలను గెలిపిస్తున్నారని చెప్పారు. మంత్రి పదవులు రాలేదని ఆవేశంలో సీనియర్ నేతలు, ఇతర నేతలు అలక వహించడం సాధారణమే అని చెప్పారు.
మాధవ్ గెలుపు - పురంధేశ్వరి లేఖ: బీజేపీ మనసులో ఏముంది? టిడిపి ఆందోళన
వైసిపి నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వడంపై పురంధేశ్వరి బీజేపీ అధిష్టానానికి ఘాటు లేఖ రాశారు. దీనిపై గాలి స్పందిస్తూ.. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ కూడా ఆ పని చేసిందని ఎద్దేవా చేశారు.
ప్రజాస్వామ్యం అంటే ఏవగింపు కలిగేలా: ధర్మాన ప్రసాద రావు
ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా స్పీకర్ కోడెల శివప్రసాద రావు వ్యవహరిస్తున్నారని వైసిపి నేత ధర్మాన ప్రసాద రావు వేరుగా మండిపడ్డారు. తమ పార్టీ నుంచి టిడిపిలో చేరిన వారిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కానీ ఆయన చర్యలు తీసుకోకుండా రాజముద్ర వేసి రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం అంటేనే ఏవగింపు కలిగేలా ఏపీ సర్కార్ పాలన ఉందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడటంలో గవర్నర్, స్పీకర్, సీఎం విఫలమయ్యారన్నారు. తాము రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. జగన్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేస్తామన్నారు.