జగన్ దీక్ష సినిమా స్టంట్ యవ్వారం.. : జలదీక్షపై గాలి ముద్దుకృష్ణమ
చిత్తూరు : పాలమూరు ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ.. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ జలదీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. కాగా.. మూడు రోజులుగా దీక్ష కొనసాగిస్తున్న జగన్ బుధవారంతో దీక్షను విరమించుకున్నారు. దీక్ష విరమణ సందర్భంగా వైసీపీ అధినేత జగన్.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
తనపై ఉన్న కేసులను ఎక్కడ తిరగదోడుతారోనన్న భయంతోనే.. అటు కేసీఆర్ ను ఇటు మోడీ ని చంద్రబాబు ఏమి అనలేకపోతున్నారని మండిపడ్డారు. ఇక జగన్ దీక్షపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడుజగన్ దీక్షంతా సినిమా స్టంట్లను తలపిస్తోందని ఎద్దేవా చేశారు.
పాలమూరు, డిండి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి తెలియజేసిందన్నారు. తాము నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతులున్నాయని తెలంగాణ మంత్రి హరీశ్ రావు చెప్పడం అవాస్తవం అన్నారు. అటు రోజా వ్యవహారంపై కూడా ముద్దుకృష్ణమ నాయుడు ఫైర్ అయ్యారు.
జగన్.. స్వార్థ రాజకీయపరుడు : అచ్చెన్నాయుడు
విశాఖపట్నం : జగన్ జలదీక్షపై స్పందించిన ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు.. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ జలదీక్షను ముందేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నీటి సమస్యలన్నింటికీ కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని విమర్శించారు. ఏపీకి ఎగువన ఉన్న రాష్ట్రాలు ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పుడల్లా తమ అభ్యంతరాలు తెలియజేస్తూనే ఉన్నామన్నారు.
జలదీక్ష చేస్తోన్న జగన్.. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు వైసీపీ నేతలే కాంట్రాక్టర్లు అన్న విషయం గుర్తుచేసుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు. తమకు కేంద్రంలో మంత్రి పదవులు ముఖ్యం కాదని చెప్పిన ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసమే చంద్రబాబు క్రుషి చేస్తున్నారని తెలిపారు.
చంద్రబాబు జగన్ కలిసి రాయలసీమను బలి పశువు చేస్తున్నారు : బైరెడ్డి
కడప: అధికార పక్షం, ప్రతిపక్షం కలిసి రాయలసీమను అగ్నిగుండంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓవైపు మంత్రులు కేఈ కృష్ణమూర్తి, దేవినేని ఉమా మహేశ్వరరావు, మరోవైపు జగన్ అంతా కలిసి తెలంగాణ ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారని తద్వారా నష్టపోయేది రాయలసీమ ప్రజలేనని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ అధికార ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటలు.. రాయలసీమ ప్రజల అభిప్రాయం ఏమాత్రం కాదన్న విషయాన్ని తెలంగాణవాదులు గ్రహించాలని విన్నవించారు. రాయలసీమ చైతన్యయాత్రంలో భాగంగా బుధవారం మైదుకూరు చేరుకున్న బైరెడ్డి రాజశేఖర్రెడ్డి మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. అభిమన్యుడిని పద్మవ్యూహంలోకి ప్రవేశించేలా చేసి చంపేసినట్లుగా.. రాయలసీమ వాసులను బలి చేసేందుకు రాష్ట్ర రాజకీయ నేతలంతా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.