తెలంగాణలో 'ఎన్టీఆర్ జిల్లా'! : తెరపైకి గాలి ముద్దుకృష్ణమ కొత్త వాదన
హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల అంశం ఇప్పుడో హాట్ టాపిక్. రేపటి నుంచి కొత్త జిల్లాలను ప్రారంభించాలనే యోచనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి పక్క రాష్ట్రం నేతల నుంచి కూడా ఈ విషయంలో మద్దతు లభిస్తుండడం విశేషం. ముఖ్యంగా కేసీఆర్ నిర్ణయాన్ని హర్షిస్తూ టీడీపీ ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమనాయుడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
కాగా, ప్రస్తుత కొత్త జిల్లాల ఏర్పాటుకు అప్పట్లో ఎన్టీఆర్ చేపట్టిన మండలాల ఏర్పాటును స్పూర్తిగా తీసుకున్నామన్న తరహాలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. ఇదే విషయంపై స్పందిస్తూ.. ఎన్టీఆర్ స్ఫూర్తితో జిల్లాల విభజన ప్రక్రియ చేపడుతున్నామని కేసీఆర్ చెప్పడం హర్షణీయమని టీడీపీ ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమనాయుడు అన్నారు.
తెలంగాణలోని ఏదేని ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టాలని ముద్దుకృష్ణమనాయుడు సూచించడం గమనార్హం. అలాగే తెలుగు గడ్డ మీద రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకునే కేసీఆర్ బీసీ సంక్షేమ హాస్టళ్లు ప్రారంభిస్తున్నారని చెప్పారు. ఇదిలా ఉంటే.. కేసీఆర్ అంటేనే విమర్శలకు పనిచెప్పే గాలి లాంటి నేతలు ఆయన నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేయడం కాస్త ఆశ్చర్యంగానే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.