పవన్ కల్యాణ్ జనసేన పార్టీలోకి గల్లా అరుణ కుమారి?
మాజీ మంత్రి గల్లా అరుణకుమారి పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. అలా సాగడానికి కారణం కూడా ఉంది...
చిత్తూరు: పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో మాజీ మంత్రి, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నాయకురాలు గల్లా అరుణ కుమారి చేరుతారనే ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీకి గత కొంత కాలంగా ఆమె దూరంగా ఉంటూ ఉండడం ఆ ప్రచారానికి ఒక కారణమైతే, అరుణకుమారికి సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై పవన్ కల్యాణ్ చిత్రం ఉండడం కూడా మరో కారణం.
సంక్రాంతి సందర్భంగా గల్లా అరుణ కుమారికి శుభాకాంక్షలు తెలుపుతూ స్థానికంగా కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ ఫ్లెక్సీపై పవన్ కల్యాణ్ ఫొటో కూడా ఉంది. దాంతో ఆమె తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. అయితే, పవన్ కల్యాణ్ తన పార్టీలోకి పాత నాయకులను ఎవరినీ తీసుకోరనే అభిప్రాయం ఒకటి ఉంది. అంతా కొత్తవారితోనే ఆయన తన పార్టీని నడిపించదలుచుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితిలో అరుణ కుమమారి జనసేనలో చేరడం సాధ్యమవుతుందా అనేది చర్చ.
కాగా, గల్లా అరుణ కుమారి గతంలో కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. ఆమె కుటుంబం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితమైంది. ఆయన మరణం తర్వాత సమీకరణాలు మారడంతో ఆమె తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. దానికితోడు, ఆమె కుమారుడు గల్ల జయదేవ్ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు.
అయితే, తనకు తెలుగుదేశం పార్టీలో సరైన గుర్తింపు లేదని గల్లా అరుణ కుమారి గత కొంత కాలంగా బాధపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆమె పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు గతంలో ఆయన వెంట ఆమె ఉండేవారు. అయితే, గత మూడు నెలలుగా ఆమె చంద్రబాబు పర్యటనకు వచ్చినా దూరంగానే ఉంటున్నారు.