ఇక నాకు వద్దు: బాబుకు గల్లా అరుణ ఝలక్, టీడీపీలో కుదుపు! కారణాలు ఇవేనా?
చిత్తూరు: తెలుగుదేశం పార్టీలో ఓ కుదుపు! చంద్రగిరి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి తనను ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పించాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరారు. ఆమె మంత్రి అమర్నాథ్ రెడ్డితో కలిసి అధినేతను అమరావతిలో కలిశారు. ఈ సందర్భంగా ఆమె తన నిర్ణయాన్ని వెల్లడించారని తెలుస్తోంది.
తన తనయుడు గల్లా జయదేవ్ ఇప్పటికే గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడని, తమ కుటుంబం నుంచి ఒక్కరే ఉంటే బాగుంటుందని, వేర్వేరు జిల్లాల్లో సరికాదని, అందుకే తనను ఇంచార్జ్ పదవి నుంచి తప్పించి మరొకరికి అవకాశమివ్వాలని ఆమె అధినేతను కోరారట. కొత్త వారిని చూసే వరకు మీరే ఉండాలని, ఆ కొత్త వారు ఎవరో కూడా మీరే చెప్పాలని.. చంద్రబాబు ఆమెపై బాధ్యతలు ఉంచారని చెబుతున్నారు.
వైసీపీ గ్రాఫ్ పెరిగింది, టీడీపీ ఓటమి ఖాయం: విష్ణు సంచలనం, జగన్ ఆగ్రహం
చంద్రబాబు నచ్చచెప్పినా
ఎన్నికలు సమీపిస్తున్నాయని, ఇలాంటి సమయంలో మీరే ఉండాలని చంద్రబాబు.. గల్లా అరుణకు చెప్పారని తెలుస్తోంది. అయితే తాను ఉండలేనని ఆమె స్పష్టం చేశారట. దీంతో గల్లా అరుణ కుమారి డాక్టర్ రమాదేవి పేరు తెరపైకి వచ్చినా ఆమె కూడా నో చెప్పారట. కొత్త ఇంచార్జ్ బాధ్యతను ఆమెకే చంద్రబాబు అప్పగించారు.
Recommended Video
ప్రాధాన్యత లేదని తప్పుకుంటున్నారా?
గల్లా అరుణ్ కుమారి కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేశారు విభజన అనంతరం 2014లో టీడీపీలో చేరి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆమె ఇంచార్జ్ బాధ్యతలను కాదనడానికి పార్టీలో తన వర్గానికి ప్రాధాన్యత లేకపోవడమే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల టీడీపీలో చేరిన కీలకమైన నామినేటెడ్ పోస్టులు ఇచ్చారని, అందులో తమ వర్గం వారు లేరని ఆమె ఆవేదనగా ఉన్నారని అంటున్నారు.
చంద్రగిరిలో ప్రయోజనం లేదనే!
గత ఏడాది ఇళ్ల నిర్మాణ ప్రారంభోత్సవం సందర్భంగా కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారని గుర్తు చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణం చంద్రగిరిలో జరగగా.. లబ్ధిదారులు అందరూ తిరుపతిలో ఓటర్లుగా ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో తమకు చంద్రగిరిలో ప్రయోజనం లేదని ఆమె వాపోయారు. దీనిని సరిచేయాలని ఆమె కోరినా స్పందన లేదట.
గల్లా జయదేవ్.. మరో కారణం
వచ్చే ఎన్నికల్లో గల్లా జయదేవ్ గుంటూరు నుంచే పోటీ చేయనున్నారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో జయదేవ్ గెలుపు కోసం అక్కడ ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారించేందుకు కూడా ఆమె బాధ్యతలు వద్దనుకుంటున్నారనే వాదనలు ఉన్నాయి.
తెరపైకి ఇద్దరి పేర్లు
గల్లా అరుణ కుమారి విముఖత చూపిన నేపథ్యంలో పులివర్తి శ్రీనివాస్ (నాని), గాలి ముద్దుకృష్ణమ నాయుడు తనయుడు గాలి భాను పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్ నేతల పేర్లు కూడా తెరపైకి వస్తున్నారట. అయితే గల్లా అరుణ సూచనలతో అక్కడ మరొకరిని నియమించే అవకాశముందని అంటున్నారు.