గల్లా అరుణ పార్టీ మారట్లేదు, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు: జయదేవ్
చిత్తూరు: తన తల్లి గల్లా అరుణ కుమారికి పార్టీ మారే ఉద్దేశ్యం లేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ బుధవారం తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయనని మాత్రమే ఆమె చెప్పారన్నారు. ఈ అంశంపై తప్పుడు ప్రచారం సాగుతోందన్నారు. తన తల్లి పార్టీ మారుతారంటూ లేని పోని ప్రచారం సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెరికా వెళ్లే ముందు పోటీ చేయమనని మాత్రమే చెప్పారన్నారు.
ఆయన బీజేపీపై కూడా మండిపడ్డారు. ఏపీకి బీజేపీ న్యాయం చేస్తుందనే నమ్మకం పోయిందన్నారు. ఏపీకి కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం కంటే బీజేపీ ఎక్కువ అన్యాయం చేసిందని విమర్శించారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలలో పొత్తు గురించి కూడా స్పందించారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఎవరితో కలిసి తాము ముందుకు సాగాలనే విషయమై కాలమే నిర్ణయిస్తుందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్తో కలవమని జేడీఎస్ నేత కుమార స్వామికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఏమీ చెప్పలేదన్నారు.
Recommended Video
వైసీపీ ఎంపీల రాజీనామాలు ఓ డ్రామాగా అభివర్ణించారు. సాధారణ ఎన్నికలకు ఏడాదిలోపు ఉపఎన్నికలు రావని తెలిసే రాజీనామా చేశారన్నారు. ఇప్పుడు రాజీనామాలు చేయడం వల్ల ఉపయోగం లేదన్నారు. సభలో ఉండి పోరాటం చేస్తేనే ఏపీకి లాభం అన్నారు.
వైసీపీ ఎంపీలు సభలో ఉంటే కేంద్రంపై పోరాటం చేయలేరని, ఒకవేళ ఖాళీగా కూర్చుంటే ప్రజలు ఛీదరించుకుంటారన్నారని, అందుకే రాజీనామా డ్రామాలాడుతున్నారన్నారు. కర్ణాటకలో ఇద్దరు ఎంపీలు రాజీనామా చేస్తే రెండు రోజుల్లో ఆమోదించారన్నారు. కానీ వైసీపీ ఎంపీలు రాజీనామాలకు రెండు నెలలు పట్టిందన్నారు.