అరుణ, జయదేవ్: ఇద్దరు టిడిపిలోకే, కిరణ్పై రఘువీరా
హైదరాబాద్/చిత్తూరు: మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత గల్లా అరుణ కుమారి కూడా తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఇప్పటి వరకు ఆమె తనయుడు గల్లా జయదేవ్ టిడిపిలో చేరుతారని, రానున్న సార్వత్రిక ఎన్నికలలో గుంటూరు పార్లమెంటు స్థానం నుండి పోటీ చేస్తారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
జయదేవ్తో పాటు అరుణ కూడా చేరనున్నారు. వారిద్దరు రేపు (శనివారం) టిడిపిలో చేరనున్నారు. వచ్చే ఎన్నికల్లో గల్లా అరుణ కుమారి చంద్రగిరి నియోజకవర్గం నుండే పోటీ చేసే అవకాశాలున్నాయి. జయదేవ్ మాత్రం గుంటూరు లోకసభకు పోటీ చేయనున్నారు.
రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన దగ్గుబాటి
ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు దగ్గుబాటి శుక్రవారం ఉదయం ప్రకాశం జిల్లా కారంచేడులో కార్యకర్తలతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు చెప్పారు. మరో వైపు ఆయన సతీమణి దగ్గుబాటి పురంధేశ్వరి ఢిల్లీలో బిజెపి అగ్రనేతల సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
కిరణ్ పైన మండిపడ్డ రఘువీరా
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన మాజీ మంత్రి రఘువీరా రెడ్డి శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీ పైన కిరణ్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమన్నారు. పార్టీని వీడుతున్న వారు కాంగ్రెసు పార్టీని తప్పుపట్టవద్దని, పార్టీని అప్రతిష్ట పాలు చేయవద్దని హితవు పలికారు.