ఇప్పుడే ఇలాఐతే: జగన్పై గల్లా, ఓటుకోసం మహిళ దీక్ష
గుంటూరు/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీరు పైన మాజీ మంత్రి, టిడిపి చంద్రగిరి అభ్యర్థి గల్లా అరుణ కుమారి బుధవారం నిప్పులు చెరిగారు. పోలింగ్ సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీరు సరిగా లేదన్నారు. ఎన్నికల సమయంలోనే ఆ పార్టీ తీరు ఇలా ఉంటే.. అధికారంలోకి వస్తే మరెంత అరాచకం రాజ్యమేలుతుందోనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
రౌడీలను రంగంలోకి దింపి పోలింగ్ కేంద్రాల్లో పీవోలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మీడియా పైన దాడులు చేస్తున్నారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అక్రమాలకు పాల్పడుతోందన్నారు. పోలీసు భద్రత కల్పించాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు.
బిజెపి ఫిర్యాదు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రిగ్గింగ్ ప్రయత్నాలను అడ్డుకోవాలని భారతీయ జనతా పార్టీ ఈసికి ఫిర్యాదు చేసింది. విశాఖలో చివరి రెండు గంటల్లో రిగ్గింగ్కు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని, కడప గూండాలతో రిగ్గింగ్కు పాల్పడే ప్రణాళికతో ఉందని బిజెపి ఆరోపించింది.
బొత్స అసంతృప్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంపై కాంగ్రెస్ అభ్యర్థి బొత్స సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎనిమిది చోట్లకు వెళితే ఐదు చోట్ల ఈవీఎంలు మొరాయించాయన్నారు. ప్రజల్లో ఓటు వేయాలన్న అవగాహన పెరిగిందని బొత్స అన్నారు.
కొయ్యూరులో రీపోలింగ్
పాడేరు నియోజకవర్గం కొయ్యూరు మండలం పలకజీడిలో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ చెప్పారు. సాయంత్రం మూడు గంటల వరకు 63 శాతం పోలింగ్ జరిగిందన్నారు.
ఓటు కోసం దీక్ష
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ మహిళ ఓటు కోసం దీక్ష చేశారు. తన ఓటును ఎవరో వేశారని, కనీసం తన కొడుకును అయినా ఓటు వేసేలా చూడాలని ఆమె పోలీసులను కోరారు.