ఉగ్రవాదుల, నక్సలైట్లు కాదు., రైతులపై ఇంత దారుణమా?: గల్లా జయదేవ్, జగన్పై నాదెండ్ల ఫైర్
అమరావతి: రాజధాని కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులు, మహిళలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు దాడులు చేస్తోందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో అక్రమంగా అరెస్టులు, మహిళలపై లాఠీ ఛార్జ్ చేయడం దారుణమని అన్నారు.
ఉగ్రవాదులు, నక్సలైట్లు కాదంటూ గల్లా జయదేవ్..
ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఉండాల్సిన సెక్షన్లను రాజధాని గ్రామాల్లో పెట్టారని గల్లా జయదేశ్ ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో తక్షణమే 144 సెక్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాజధాని కోసం రైతులు భూములిచ్చింది.. తన్నుకోవడానికా? అని నిలదీశారు. రాజధాని రైతులు నక్సలైట్లు కాదంటూ జగన్ సర్కారుపై మండ్డిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం తన పంథా మార్చుకోవాలని గల్లా జయదేవ్ అన్నారు. రాజధాని రైతుల పోరటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు.
రాజకీయ లబ్ధి కోసమేనంటూ నాదెండ్ల..
ఇది ఇలావుండగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మంగళగిరిలో జనసేన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాజధాని ఒకే చోట ఉండాలి.. పరిపాలన అక్కడి నుంచేసాగాలి అనే తీర్మానానికి కట్టుబడి ఉంటుందని జనసేన స్పష్టం చేసింంది.
గుడికెళ్తున్న మహిళలపై లాఠీఛార్జీ చేస్తారా?
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఏడు నెలల్లోనే ఇంతగా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని అన్నారు. గతంలో ఓదార్పు యాత్ర, పాదయాత్ర చేపట్టిన జగన్.. ఇప్పుడు ఇంత పోరాడుతున్నా కనీసం మాట్లాడకపోవడం దారుణమని అన్నారు. పోలీసుల లాఠీఛార్జీలతో అమరావతిలో యుద్ధ వాతావరణం నెలకొందని అన్నారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు వెళుతున్న మహిళలపైనా పోలీసులు లాఠీఛార్జీ చేశారని మండిపడ్డారు. రైతుల ఇళ్లకు వెళ్లి పోలీసులు తాళాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల దాడిలో మహిళ చేయి విరిగింది..
కాగా, అమరావతిలో రాజధాని కోసం రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ గత 24 నుంచి రైతులు అమరావతిలో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆందోళన చేస్తున్న రైతులపై పలుమార్లు పోలీసులు లాఠీఛార్జీ జరపడంతో పలువురు గాయపడ్డారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు లాఠీఛార్జీ చేయడంతో పలువురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఓ మహిళకు చేయి విరగడం గమనార్హం. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు ఎందుకు లాఠీఛార్జీ చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. జగన్ సర్కారుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.