ఆలస్యం వద్దనే: 8న టిడిపిలోకి గల్లా, శిల్పామోహన్ రెడ్డి
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన నేపథ్యంలో పార్టీలో చేరేందుకు ఇంకా ఆలస్యం చేయకూడదని జయదేవ్ భావిస్తున్నారట. అసలు ఆయన జనవరి నెలలోనే టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారని ప్రచారం సాగింది. ఆయన వ్యాఖ్యలు, తల్లి గల్లా అరుణ వ్యాఖ్యలు కూడా అందుకు తోడయ్యాయి. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదలయినందున త్వరగా చేరి, ప్రచారం చేయాలని భావిస్తున్నారట. ఆయన గుంటూరు లోకసభ స్థానం నుండి పోటీ చేసే అవకాశాలున్నాయి.
శిల్పా మోహన్ రెడ్డి కూడా
కర్నూలు జిల్లా నంద్యాల కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి కూడా టిడిపిలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 8న అధికారికంగా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.
డిఎల్ ఎటువైపు...?
మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఖాజీపేటలో సమావేశం ఏర్పాటు చేశారు. తన రాజకీయ భవిష్యత్తు నిర్ణయించమని కోరుతూ ఆరు అంశాలతో కూడిన బ్యాలెట్ పత్రాన్ని విడుదల చేశారు. స్వయంగా అందరికీ అందజేశారు.
రాష్ట్ర విభజనతో జిల్లాలోనే కాదు సీమాంధ్రలోనే దయనీయంగా మారిన కాంగ్రెస్లో కొనసాగాలా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలా, టిడిపిలోకి వెళ్లాలా ఇవన్నీ కాదని రాజకీయాల నుంచి తప్పుకోవాలా అనే అంశాలతో కూడిన బ్యాలెట్ పత్రం విడుదల చేశారు. అనుచరులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలకు అనుగుణంగా టిక్ వేసిన బ్యాలెట్లను బాక్సులో వేశారు.
నియోజకవర్గ ప్రజల అండదండలతో 1978లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన తాను ప్రజా సమస్యల పరిష్కారంలో తలమునకలై కుటుంబాన్ని పట్టించుకోలేక పోయానన్నారు. ఇంట్లో బియ్యం నిండుకుని తన తల్లిదండ్రులు ఇబ్బందుల పాలయ్యారన్నారు. రాజకీయాల్లోకి వెళ్లి తమను పస్తులపాలు చేస్తున్నావని ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేసుకుని కంట తడిపెట్టారు.
టిడిపి వైపు శత్రుచర్ల చూపు
టిడిపిలోకి కాంగ్రెస్ నేతల వలసలు భారీగా పెరిగిన నేపథ్యంలో విజయనగరం జిల్లాకు చెందిన అటవీశాఖ మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కూడా ఆ పార్టీ వైపు చూస్తున్నట్టు సమాచారం.