మోడీ సినిమాలో అద్భుత నటన, జగన్, పవన్ కుట్రలు: గల్లా, ‘మా పవన్ అంటూ రోజా’
గుంటూరు: తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి కేంద్రం, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీ అధినేతలపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ సినిమాలో పవన్ కళ్యాణ్, వైయస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు.
త్వరలో కొత్త సినిమా 'జగన్-పవన్', ప్రశాంత్ డైరెక్షన్, మోడీ-షా ప్రొడక్షన్: గల్లా సెటైర్లు
ప్రత్యేక హోదాపై పవన్, జగన్.. మోడీని ఎందుకు నిలదీయడంలేదని ఆయన ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వంపై టీడీపీ రోజురోజూకీ ఒత్తిడి పెంచుతుంటే.. వైసీపీ పోరాటాన్ని తగ్గించిందన్నారు.
పవన్ ఎందుకు వెనకాడుతున్నారు?
గత ఎన్నికల్లో పవన్ బీజేపీతోనే పొత్తు పెట్టుకున్నారన్న జయదేవ్.. హోదా కోసం ఎన్డీయే నుంచి టీడీపీ బయటికి వచ్చినప్పటికీ పవన్ ఎందుకు వెనకాడుతున్నారని జయదేవ్ నిలదీశారు.
కుట్రలకు స్వస్థి చెప్పాలి
పవన్, జగన్ కుట్ర రాజకీయాలకు స్వస్తి చెప్పాలని, ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడాలని కోరారు. మోడీని పల్లెత్తు మాట అనకుండా టీడీపీ, చంద్రబాబుపై జగన్, పవన్ విమర్శలు చేస్తున్నారని అన్నారు.
మా పవన్ అంటూ రోజా..
అంతేగాక, గత కొన్ని రోజులుగా వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ను పొగుడుతున్నారని గల్లా జయదేవ్ అన్నారు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా ‘మా పవన్ను అంటారా' అంటూ వ్యాఖ్యానించారని తెలిపారు. జగన్, పవన్ కలుస్తారో లేదో తెలియదు కానీ, ఇదంతా నడిపిస్తున్నది బీజేపీనేనని అన్నారు.
జగన్ జిల్లాలో అడుగుపెట్టరు?
ఇది ఇలా ఉండగా, ప్రతిపక్ష నేత జగన్పై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మచిలీపట్నం పోర్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ప్రయత్నాన్ని జగన్ మానుకోకపోతే జిల్లాలో అడుగుపెట్టే పరిస్థితి ఉండదని మంత్రి హెచ్చరించారు. పోర్టు అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ఓ సంస్థ సిద్ధంగా ఉందన్నారు. ఆ సంస్థ రూ.3వేల కోట్లతో భూమి కొనుగోలు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని కొల్లు రవీంద్ర వివరించారు.