కరక్కాయ పొడి స్కామ్ తో నెల్లూరుకు సంబంధం?...ఇటీవలే అదే తరహా మోసం!
నెల్లూరు:తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కరక్కాయల పొడి మోసానికి నెల్లూరు జిల్లాతో ఏమైనా సంబంధం ఉందా?... ఇప్పుడు ఇదే ప్రశ్న సంబంధిత పోలీసు అధికారుల్లో ఉత్పన్నమై ఆ దిశలో విచారణకు కారణమైనట్లు తెలుస్తోంది.
ఇంతకూ పోలీసులకు ఆ సందేహం కలగడానికి ప్రధానంగా రెండు కారణాలు దోహదపడినట్లు తెలిసింది. ఒకటి ఈ స్కామ్ సూత్రధారి ముప్పాళ్ల మల్లికార్జునరావు పలువురికి తన స్వస్థలం నెల్లూరు జిల్లా అని చెప్పడం...రెండవది ఇటీవలే నెల్లూరు లో చోటుచేసుకున్న ఒక సంచలనాత్మక ఆధ్యాత్మిక స్కామ్ కు, ఈ తాజా కరక్కాయ పొడి స్కామ్ కు చాలా సారూపత్యత ఉండటం...పోలీసులు ఈ కేసుకు నెల్లూరుతో సంబంధం ఉండొచ్చని భావించేందుకు కారణమైంది.
కరక్కాయ పొడి పేరిట కోట్లాది రూపాయలు దండుకున్న
కుంభకోణంలో ప్రధాన సూత్రధారి ముప్పాళ్ల మల్లిఖార్జునరావు కోసం పోలీసుల వేట ముమ్మరంగా కొనసాగుతోంది. పరారీలో ఉన్న ఈ నిందితుని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు పోలీసుల దృష్టి నెల్లూరు జిల్లా పై పడింది. ముప్పాళ్ల మల్లి ఖార్జునరావు తాను నెల్లూరు జిల్లా వాసినని పలువురితో చెప్పిన విషయం పోలీసుల దృష్టికి రావడం, అది నిజమేననేందుకు కొన్ని ఆధారాలు లభ్యం కావడంతో ఇక కొన్ని కొన్ని పోలీసు బృందాలు ఇతడి ఆచూకి కోసం నెల్లూరుకు బయలుదేరినట్లు తెలిసింది.
అయితే...జిల్లాలో ఎక్కడా?
ముప్పాళ్ల మల్లిఖార్జునరావు ఆచూకి కోసం నెల్లూరు జిల్లా బయలుదేరిన పోలీసు బృందాలు ఇక్కడి జిల్లా పోలీసులకు సమాచారం పంపారని తెలిసింది. కేసు దర్యాప్తులో భాగంగా మల్లికార్జునరావు సొంత గ్రామం ఏది?...గతంలో ఇతడు ఈ తరహా నేరాలకు ఎక్కడైనా పాల్పడ్డాడా?...ఏమైనా కేసులు నమోదయ్యాయా?...ఇలా వివిధ కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారట. ఈ క్రమంలో కొంత కీలక సమాచారం కూడా పోలీసులకు లభ్యమైనట్లు తెలుస్తోంది. పారిపోయిన తరువాత మల్లిఖార్జునరావు సొంత జిల్లా నెల్లూరు కాబట్టి ముందుగా ఏమైనా ఇక్కడకు వచ్చి ఉండొచ్చా?అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారని సమాచారం.
నెల్లూరులో...ఆ స్కామ్ సంచలనం
ఇటీవలే నెల్లూరు నగరంలో చోటుచేసుకున్న భక్తితో ముడిపడివున్న ఒక స్కామ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడి పేరు సుధాకర్బాబా కాగా నెల్లూరు ప్రశాంతి నగర్లో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న ఈ వ్యక్తి చేసిన స్కామ్ కు...తాజాగా జరిగిన కరక్కాయ పొడి స్కామ్ కు చాలా దగ్గర సామ్యం ఉండటం గమనార్మం. సుధాకర్ అనే బురిడీ బాబా ఇలాగే హోమం పేరుతో భారీ మొత్తంలో డిపాజిట్లను వసూలు చేశారు. ఇలాగే కోట్లు వసూలు చేసి డబ్బులు చెల్లించకుండా మాయమయ్యారు. ఆ తరువాత ఆ బురిడీ బాబా పోలీసులకు లొంగిపోయాడు.
రెండు స్కామ్ లకు...దగ్గరి సారూప్యం
ఈ స్కామ్ లో భక్తులు బురుడీ బాబా చెప్పిన ప్రకారం "నామ కోటి" పుస్తకాలకు రూ. 1000 డిపాజిట్ చెల్లించి తీసుకుని 15 రోజుల్లోగా వాటిని పూర్తి చేసి ఇస్తే...తొలుత అలా చేసి ఇచ్చిన వారికి రూ.1,500 చొప్పున చెల్లించారు. దీంతో ప్రజలు చాలా మంది ఆయన దగ్గర రూ.లక్షల్లో డిపాజిట్లు చెల్లించి నామ కోటి పుస్తకాలను తీసుకున్నారు. ఈ విధంగా రూ.కోట్లాది రూపాయల డిపాజిట్లు వసూలు అయ్యాక భక్తులకు తిరిగి డబ్బు చెల్లింకుండా పరారయ్యారు. ఈ స్కామ్ లో ఒక మహిళ తన కుటుంబ సభ్యులతో పాటు కీలకపాత్ర పోషించింది. ఇక ప్రస్తుతం మల్లికార్జునరావు కూడా కరక్కాయల పొడి పేరుతో చేసిన కుంభకోణం ఆ స్కామ్ తరహాలోనే ఉండటం గమనార్హం. అందుకే పోలీసులు కరక్కాయ పొడి స్కామ్ కు సంబంధించి నెల్లూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు.