టి బిల్లు: జగన్ పార్టీకి గండ్ర క్లాస్, బిఎసిలో చీలిన టిడిపి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్య రాష్ట్రం కోసం తీర్మానం చేయాలని డిమాండ్ చేయడం ఏమాత్రం సరికాదని, భారత రాష్ట్రపతి నిర్ణయన్ని అందరూ గౌరవించాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి మంగళవారం చెప్పారు. బిఏసి సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
జగన్ పార్టీ సమైక్య తీర్మానం అని కోరడం సరికాదన్నారు. రాష్ట్రపతి, కేంద్రం బిల్లును పంపించిన ఈ పరిస్థితుల్లో ఇది ఆక్షేపణీయమన్నారు. భారత రాష్ట్రపతి నిర్ణయాన్ని అందరూ గౌరవించాలన్నారు. సభా సమయాన్ని సభ్యులు అందరూ వినియోగించుకోవాలని కోరారు.
ఆందోళనలతో సభా సమయాన్ని వృధా చేయవద్దన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన సభ్యులందరికీ మాట్లాడే అవకాశం వస్తే మంచిదే అన్నారు. విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయం ఆయనకు, తన అభిప్రాయం తనకు ఉంటుందని చెప్పారు.
సభాపతి పైన తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నాయకులు గాలి ముద్దుకృష్ణమ నాయుడు చేసిన వ్యాఖ్యలకు భేషరతు క్షమాపణ చెప్పాలన్నారు. సభలో ఎవరి అభిప్రాయం వారు చెప్పుకోవచ్చన్నారు. కాగా, బిఎసి సమావేశంలో టిడిపి రెండుగా చీలిపోయిన విషయం తెలిసిందే. సీమాంధ్ర టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ వాకౌట్ చేయగా, సమావేశం చివరి వరకు తెలంగాణ ప్రాంత టిడిపి నేత ఉన్నారు.
రేపటి నుండి చర్చ: హరీష్, మోత్కుపల్లి
రేపు ఉదయం తొమ్మిది గంటలకు తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ ప్రారంభమవుతుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు, తెరాస సిద్దిపేట శాసన సభ్యులు హరీష్ రావులు చెప్పారు. శుక్రవారం వరకు బిల్లుపై చర్చ జరుగుతుందన్నారు. సమనయం సరిపోకపోతే సభ పొడిగింపు పైన సభాపతి నిర్ణయాన్ని రేపు తెలియజేస్తారన్నారు.
జగన్ పార్టీ అపాయింట్మెంట్ కోసం వెయిటింగ్: అశోక్ బాబు
ఈ నెల 20వ తేదీన అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తున్నామని, అందులో పార్టీలు విభజనపై తమ పార్టీ అభిప్రాయం స్పష్టంగా చెప్పాలన్నారు. అసెంబ్లీలో అన్ని పార్టీలు తెలంగాణ బిల్లును వ్యతిరేకించాలన్నారు. జెండాలు పక్కన పెట్టి పోరాడాలన్నారు. అఖిల పక్ష సమావేశం కోసం అన్ని పార్టీలకు ఆహ్వానం పంపామని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అపాయింటుమెంట్ కోసం వేచి చూస్తున్నట్లు చెప్పారు.