గణేష నిమజ్జనం: భారీ వర్షంలోనే శోభాయాత్ర
హైదరాబాదులోని ట్యాంక్బండ్పైనే కాకుండా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. శోభాయాత్ర సాగే చార్మినార్ వద్ద భారీ వర్షం పడుతోంది. ఖైరతాబాద్, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట పంజగుట్ట, మలక్పేట, దిల్షుక్నగర్ వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. హైదరాబాదు శివార్లలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది.
గణేషుడి నిమజ్జనానికి 23 వేల మంది పోలీసులను ప్రత్యేకంగా నియోగించారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఏరియల్ సర్వే నిర్వహించారు. గురువారం ఉదయం వరకు వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగే అవకాశం ఉంది. ట్యాంక్బండ్పై భక్తుల సందడితో కోలాహాలం నెలకొని ఉంది.
హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జన కార్యక్రమం జోరుగా కొనసాగుతోందని హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) కమిషనర్ కృష్ణబాబు తెలిపారు. ఈ ఏడాది 75వేలకు పైగా గణేష్ విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశం ఉందని ఆయన మీడియాతో అన్నారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన సమయంలో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కృష్ణబాబు తెలిపారు. హుస్సేన్ సాగర్తో పాటు నగరంలోని పలుచోట్ల నిమజ్జనం వేగవంతం చేసినట్లు చెప్పారు.
నిమజ్జనం అనంతరం ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించేందుకు 2,300 మంది కార్మికులను ఏర్పాటు చేసినట్లు కృష్ణబాబు తెలిపారు. విగ్రహాల నిమజ్జనానికి 59 పెద్ద క్రేన్లు, 79 మొబైల్ క్రేన్లతో పాటు 85మంది గజ ఈతగాళ్లనునియమించినట్లు కృష్ణబాబు పేర్కొన్నారు.