ఖైరతాబాద్ గణేష్వద్ద షార్ట్సర్క్యూట్, బాలాపుర్పై ఆసక్తి
హైదరాబాద్/విజయవాడ: ఖైరతాబాద్ సహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గణేషుడి నిమజ్జనం సోమవారం ఉదయం ప్రారంభమైంది. హైదరాబాదులో దాదాపు నలభై వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం కానున్నట్లుగా తెలుస్తోంది. ఖైరతాబాద్ వినాయకుడి పైన హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించనున్నారు.
ఖైరతాబాద్ గణేషుడి షార్ట్ సర్క్యూట్
ఖైరతాబాద్ గణేషుడి వద్ద సోమవారం ఉదయం స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్లెక్సీలు కాలి పోయాయి. వెంటనే గుర్తించడంతో ప్రమాదం తప్పింది.
బాలాపూర్ లడ్డూపై ఆసక్తి
బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట ఆ గ్రామ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. హైదరాబాదులోని ఖైరతాబాద్ వినాయకుడికి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో బాలాపూర్ లడ్డూ వేలంపాటకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. గణేష్ నిమజ్జనం రోజున బాలాపూర్ లడ్డూను ఎవరు సొంత చేసుకుంటారు? ఎంతకు సొంతం చేసుకుంటారనే ఆసక్తి నెలకొంది.
బాలాపూర్ లడ్డూ వేలంపాటలో ముస్లింలు సైతం పాల్గొంటారు. తొలిసారి 1994లో బాలాపూర్ లడ్డూను వేలం వేయడం ప్రారంభించారు. ఆ ఏడాది కేవలం రూ. 450కి లడ్డూ అమ్ముడుపోయింది. అయితే, ఏడాదికేడాదికీ లడ్డూ వేలం పెరుగుతూనే ఉంది. పోయిన ఏడాది హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి రూ. 9.26 లక్షలకు లడ్డూను వేలంపాటలో సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది రూ. 10 లక్షల వరకు వేలంపాట కొనసాగవచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
కాగా, బాలాపూర్ గణేషుడు మండపం నుండి కదిలాడు. గ్రామంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఊరేగింపు నిర్వహిస్తున్నారు. భజనలు చేస్తూ ఊరేగిస్తున్నారు. వేలంపాట కోసం భారీగా భక్తులు తరలి వస్తున్నారు.
భారీ భద్రత
గణేషుడి నిమజ్జనం సందర్భంగా సంఘ విద్రోహ శక్తులు దుశ్చర్యలకు పాల్పడే అవకాశమున్నందున భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆల్ఖైదా, ఇండియన్ ముజాహిదీన్ లాంటి ఉగ్రవాద సంస్థలు దేశంలో దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న ఇంటలిజెన్స్ నివేదిక కూడా ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. దాదాపు 40 వేల మంది పోలీసులతో నిమజ్జనానికి భారీ బందోబస్తు కల్పిస్తున్నారు.
ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది నిఘాను పెంచారు. దారి పొడవునా సీసీ కెమెరాలు కన్నేసి ఉంచాయి. 30 బాంబు నిర్వీర్య దళాలు రంగంలోకి దిగాయి. వీటన్నిటికి తోడు, గణేష్ నిమజ్జనాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చేయనున్నామని డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. ఈ ఏరియల్ సర్వేలో హైదరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డి కూడా పాల్గొంటారు.
ట్రాఫిక్ మళ్లింపు
నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాదులో 18 చోట్ల ట్రాఫిక్ మళ్లించనున్నరు. జిల్లాల నుండి వచ్చే బస్సులు శివారుల వరకే రానున్నాయి. మహబూబ్ నగర్, కర్నూలు నుండి వచ్చే బస్సులు ఆరాంఘర్, శ్రీశైలం నుండి వచ్చే బస్సులు మిథానీ, కరీంనగర్, అదిలాబాదుల నుండి వచ్చే బస్సులు జేబీఎస్, సూర్యాపేట, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు నుండి వచ్చే బస్సులు ఎల్బీనగర్లకే పరిమితం కానున్నాయి. బీహెచ్ఈఎల్, జీడిమెట్ల, కెపీహెచ్బీ, గోద్రేజ్ వై జంక్షన్, ఉప్పల్ తదితర ప్రాంతాలలో వాహనాలు ఆగనున్నాయి.