విశాఖలో రికార్డ్: గణేష్ లడ్డు 12.75లక్షలు, సాయానికే
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గణేషుడి లడ్డూ వేలంలో రికార్డ్ సృష్టించింది. విశాఖలోని మురళీ నగర్లో గల విజయ గణపతి లడ్డూ వేలంలో రూ.12.75 లక్షలు పలికింది. వేలంలో వచ్చిన డబ్బును చిన్నపిల్లల గుండె చికిత్స కోసం ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కు ఇస్తామని వినాయక మండప నిర్వాహకులు తెలిపారు.
హైదరాబాదులోని నేరేడ్మెట్లో గణేష్ లడ్డూ వేలం పాటలో భారీ ధర పలికిన విషయం తెలిసిందే. వెస్ట్ దీనదయాల్ నగర్ వినాయకుడి లడ్డూనూ రూ.11.75 లక్షలకు సొంతం చేసుకున్నారు. ప్రాముఖ్యత కలిగిన బాలాపూర్ లడ్డూ ధర కంటే రెండు లక్షలకు పైగా అధిక రేటు పలికింది.
బాలాపూర్ లడ్డూ రూ.9.50 లక్షలు పలికిన విషయం తెలిసిందే. సింగిరెడ్డి జయేందర్ రెడ్డి ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. గుంటూరులోని మిర్చి యార్డు గణేష్ లడ్డూను రూ.2.75 లక్షలకు యలమంచిలి పుల్లారావు దక్కించుకున్నారు.
నిమజ్జనానికి తరలివెళ్లడానికి ఖైరతాబాద్ వినాయకుడు సిద్ధమయ్యాడు. మరికొన్ని గంటల్లో ఈ భారీ గణనాథుని తరలించనున్నారు. ఈ క్రమంలో ఈ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ప్రభుత్వం హెలికాప్టర్ ద్వారా వినాయకుడిపై పూలవాన కురిపించబోతోంది. దీనిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఖైరతాబాద్ తరలివస్తున్నారు. ఇప్పటికే వినాయకుడిని నెలకొల్పిన ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతోంది.