తనను కిడ్నాప్ చేసి, హత్యచెయ్యాలని చూస్తున్నారని పీవీపీపై ఫిర్యాదు చేసిన బండ్ల.. ఇరువురిపై కేసులు
సినీ నిర్మాతలు పీవీపీ, బండ్ల గణేష్ ల మధ్య అర్థరాత్రి చోటు చేసుకున్న వివాదం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది . దీంతో పివిపి మరియు బండ్ల గణేష్ లు ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. అర్థరాత్రి సమయంలో బండ్ల గణేష్ అతని అనుచరులు వచ్చి తనపై దాడి చేశారని గణేష్, అతని అనుచరులపై పీవీపీ ఫిర్యాదు చేశారు. ఇక ఈ నేపథ్యంలో అదే తరహాలో ఆర్థిక లావాదేవీలను ప్రస్తావిస్తూ బండ్ల గణేష్ కూడా జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో పీవీపీ పై ఫిర్యాదు చేశారు.
పీవీపీ పై బండ్ల గణేష్ దౌర్జన్యం: టెంపర్ సినిమా వివాదం: జగన్ కు బండ్ల వేడుకోలు..!
పీవీపీ తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని, తనను హత్య చేసేందుకు ప్లాన్ చేశారని బండ్ల గణేష్ ఫిర్యాదు చేశారు. తాను డబ్బులు బకాయి ఉన్నానంటూ కోర్టుకు ఎక్కి, కేసులు వేసిన వైసీపీ నేత పీవీపీ, ఇప్పుడు తనపై దౌర్జన్యానికి దిగుతూ, హత్య చేస్తానని బెదిరిస్తున్నారని సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఆరోపించారు. ఈ ఉదయం జూబ్లీహిల్స్ పోలీసులకు పీవీపీపై ఫిర్యాదు చేసిన అనంతరం బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడారు.
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై పి వి పి వేధింపులు చాలా పెరిగాయని బండ్ల గణేష్ పేర్కొన్నారు. తనకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందన్నారు. ఇదే సమయంలో పీవీపీ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరినట్టు బండ్ల గణేష్ తెలిపారు. అధికార పార్టీ నాయకుడైన పీవీపీ విజయవాడ తన చేతుల్లోనే ఉందని, ఏపీలో తాను ఏం చెబితే అది జరుగుతుందని బెదిరించినట్టు బండ్ల గణేశ్ తెలిపారు. తనను హత్య చేసేందుకు రెక్కీ కూడా నిర్వహించారని, ముఖ్యంగా ఏపీలో టీడీపీ ప్రభుత్వం పోయి, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తనకు వేధింపులు పెరిగాయని అన్నారు. పోలీసు ఉన్నతాధికారులు పీవీపీని పిలిపించి మాట్లాడతామని తనకు హామీ ఇచ్చారని మీడియా బండ్ల గణేశ్ మీడియాకు వివరించారు .
టెంపర్ సినిమా ఆర్ధిక లావాదేవీల్లో పీవీపీ నుంచి రూ.7 కోట్లు ఫైనాన్స్ కింద తీసుకున్న బండ్ల గణేష్ సినిమా విడుడదల సమయంలో అసలు మొత్తాన్ని చెల్లిం చారు. ఇంకొంత మొత్తానికి గానూ గణేష్ చెక్కులను ఇచ్చారు. అయితే మిగిన అమౌంట్ ఇంకా ఇవ్వకపోవడంతో గతరాత్రి బండ్ల గణేష్కు ఫోన్ చేసి డబ్బులు అడిగారు పీవీపీ. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బండ్ల గణేష్, ఆయన అనుచరులు పీవీపీ ఇంటిపై దాడి చేసి బెదిరించాడని పీవీపీ ఆరోపిస్తున్నారు . ఆ తర్వాత జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో బండ్ల గణేష్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు పీవీపీ. బండ్లగణేష్ సహా మరో నలుగురిపై కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసు విషయంలో బండ్లగణేష్ పరారీలో ఉన్నాడని వార్తలు వచ్చాయి కానీ బండ్ల గణేష్ కూడా జూబ్లీహిల్ల్స్ పోలీస్ స్టేషన్ లో పీవీపీపై ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువురిపై కేసులు నమోదు అయ్యాయి.