రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం: కర్నూలు జిల్లాలో వింత..!
అమరావతి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గురువారం తెల్లవారుజామున బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. తెల్లవారుజామున రాజమండ్రి దివాస్ చెరువు 4వ వంతెన వద్ద ఆటోలో వెళ్తున్న ప్రయాణికులపై బ్లేడ్ బ్యాచ్ దాడికి తెగబడింది. ఈ దాడిలో ముగ్గురు ప్రయాణికులు తీవ్ర గాయాలు పాలయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో బ్లేడ్ బ్యాచ్ గ్యాంగ్లు హత్యాయత్నాలకు సైతం పాల్పడుతున్నారు. బ్లేడ్ బ్యాచ్ దాడిలో గాయపడ్డ బాధితులు నల్గొండ జిల్లాకు చెందినవారు. పని నిమిత్తం నల్గొండ నుంచి రాజమండ్రికి వస్తున్న నేపథ్యంలో ఈ తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది.
ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని బ్లేడ్ బ్యాచ్ దాడులు చేస్తున్నారు. బాధితుల వద్ద నుంచి నగలు, నగదుని బ్లేడ్ బ్యాచ్ దోచుకెళ్లారు. బ్లేడ్ బ్యాచ్ దాడిలో గాయపడిన వారిని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు మేరకు రాజమండ్రి 3వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో కూడా క్యాంటిన్లో పనిచేసే ఓ వ్యక్తిని నగరంలోని గోకవరం బస్టాండ్ వద్ద చంపేసి డబ్బు దోచుకెళ్లారు. ఇలాంటి సంఘటనలు గతంలో పలుమార్లు జరిగినప్పటికీ, పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసులు పెట్టారు. మళ్లీ బ్లేడ్ బ్యాచ్ ఇలాంటి ఘటనలకు పాల్పడటంతో సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి.
మట్టి తవ్వకాల్లో ఉప్పొంగిన గంగమ్మ
తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడి ప్రతాపం రోజురోజుకీ ఎక్కువవుతోంది. బావులు, వ్యవసాయ బోర్లు ఎండిపోతున్నాయి. భూములు నెర్రలు తీస్తున్నాయి. అడుగులకు అడుగులు తవ్వినా నీటిజాడే కనిపించని పరిస్థితి. మండుటెండలో చుక్కనీరు లేక అవస్థలు పడుతున్నారు.
అడుగుల మేర భూమిని తవ్వినా నీటి జాడే కనిపించడం లేదు. ఈ విపత్కర పరిస్థితికి భిన్నంగా నిన్న కర్నూలు జిల్లాలో ఓ అరుదైన ఘటన వెలుగుచూసింది. మట్టి కోసం తవ్వకాలు జరిపిన ప్రాంతంలో గంగమ్మ తల్లి ఉప్పొంగింది. కర్నూలు జిల్లాలోని ఆలూరు మండలం హత్తిబెళగల్ గ్రామానికి చెందిన రైతులు చిదానందగౌడ్, బసవరాజుగౌడ్ పొలాల్లో రహదారి నిర్మాణానికి తమ పొలంలో 12 అడుగుల్లో మట్టి తవ్వారు.
ఇటీవలే జరిగిన ఈ తవ్వకాలకు ముందు అక్కడ చుక్క నీరు కూడా లేదు. అయితే 15 రోజుల క్రితం ఆ గుంతల్లో తేమ రావడం మొదలైంది. చుక్క చుక్కగా బయటకు వస్తున్న నీరు... ప్రస్తుతం ఐదడుగుల స్థాయికి చేరింది. మండుటెండల్లో ఇంత మేర నీటి ప్రవాహం భూమిలో నుంచి ఉబికిరావడం ఆ రైతులనే కాకుండా అక్కడి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.