విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ యత్నం;బ్లాక్ మెయిల్...ఆలస్యంగా వెలుగులోకి:నిందితులు అరెస్టు
విజయవాడ:సోషల్ మీడియా పరిచయాలను అడ్డు పెట్టుకొని మహిళలను దారుణంగా మోసగిస్తున్న ఉదంతాలు ఎన్ని వెలుగు చూస్తున్నా ఇంకా అమాయకత్వంతోనో, అవగాహన లేకో యువతులు మోసపోతూనే ఉన్నారు.
తాజాగా కృష్ణా జిల్లాలో చోటుచేసుకున్న ఇటువంటి ఉదంతం సంచలనం సృష్టించింది. ఫేస్ బుక్ పరిచయాన్ని అడ్డుపెట్టుకొని విద్యార్థిని హోటల్ కు తీసుకెళ్లిన ఒక యువకుడు తన స్నేహితులతో కలసి ఆమెపై గ్యాంగ్ రేప్ యత్నం చేయడంతో పాటు...ఆ దృశ్యాలను వీడియోతీసి బ్లాక్ మెయిల్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడగా పోలీసులు విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే...
మైలవరంలోని ఓ కాలేజ్ లో చదువుతున్న విద్యార్థినికి ఇబ్రహీంపట్నంకు చెందిన మణికంఠ అనే యువకుడితో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మణికంఠ ఈ నెల 11న ఆమెకు మాయమాటలు చెప్పి, స్థానికంగా ఉన్న కేవీఆర్ గ్రాండ్ హోటల్ లో తాను బుక్ చేసిన రూమ్ కి తీసుకువెళ్లాడు. అక్కడ యువతిని బెదిరించి మణికంఠ తన స్నేహితుడు ధీరజ్, భాషతో కలిసి అత్యాచారం యత్నం చేశాడు. పైగా ఆ అత్యాచార యత్నం దృశ్యాలను వీడియోలో చిత్రీకరించారు.
ఈ క్రమంలో ఆ యువతి అక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకొని బైటపడింది. అనంతరం ఈ దృశ్యాలను సెల్ లో చిత్రీకరించిన వ్యక్తులు వారి గ్రూప్ లోని మరో వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించాలని యత్నించారు. ఈ వీడియోను ఫేస్బుక్, వాట్సాప్లో పెడతామని బెదిరించారు. ఈ నేపథ్యంలోనే ఆ వీడియోలోని కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
దీంతో ఆ వీడియోలోని యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులు మణికంట, ధీరజ్, భాష లను అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనలో తనపై ఎలాంటి అత్యాచారం జరగలేదని, మణికంఠ అనే స్నేహితుడితో లాడ్జికి తాను వెళ్లానని, అక్కడ అతని స్నేహితులు తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారని బాధితురాలు ఫిర్యాదు సందర్భంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు నిందితులపై అత్యాచారయత్నం అభియోగాల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.