గుంటూరులో దారుణం:యువతికి మత్తుమందు ఇచ్చి...సామూహిక అత్యాచారం
గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. నగరానికి చెందిన ఓ మహిళపై ఇదే నగరానికి చెందిన కొందరు యువకులు మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది.
ఆటో డ్రైవర్ రఫీ అనే వ్యక్తి, అతడి స్నేహితులు తనకు మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారం చేశారంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. నల్లచెరువుకు చెందిన తనను రఫీ బలవంతంగా తీసుకువచ్చి తన స్నేహితలతో కలసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు బాధితురాలు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనంతరం బాధితురాలిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళితే...గురువారం రాత్రి ఆటో డ్రైవర్ రఫీ నల్లచెరువుకు చెందిన యువతిని భయపెట్టి నెహ్రూనగర్ తీసుకువచ్చాడు. ఆ తరువాత యువతికి మత్తు మందు ఇచ్చి తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున పూర్తి మత్తు వదిలిన తర్వాత జరిగిన ఘోరం గురించి గ్రహించిన ఆ యువతి ఈ దారుణం గురించి ముందుగా స్థానికులకు తెలియచేసింది. తదనంతరం స్థానికుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులు పరారీలో ఉన్నట్లు గుర్తించారు.
మరోవైపు కడప జిల్లాలో ప్రేమ వేధింపులు తాళలేక సి.వరలక్ష్మీ(21) అనే యువతి విషపుగుళికలు తిని ఆత్మహత్య చేసుకోవడ కలకలం రేపింది. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం మొయిళ్లకాల్వలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై రాజరాజేశ్వర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మొయిళ్లకాల్వ ఎస్సీ కాలనీకి చెందిన వరలక్ష్మీ డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం కడపలో కంప్యూటర్ కోర్సు చేస్తోంది. ఈమెను పెండ్లిమర్రి మండలం కొత్తపేటకు చెందిన ఎ.సమరసింహారెడ్డి అనే యువకుడు కొంతకాలం నుంచి ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతూ వేధిస్తున్నాడు.
బుధవారం వరలక్ష్మి కడపలో కంప్యూటర్ ట్రయినింగ్ కు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా సమరసింహారెడ్డి ఆమెను వెంబడించాడు. నిన్ను ప్రేమిస్తున్నాని...తనను పెళ్లి చేసుకోవాలని...లేకపోతే మీ ఊళ్లో నిన్ను అవమానపరిచి బైటకు వచ్చే పరిస్థితి లేకుండా చేస్తానంటూ వరలక్ష్మీని బెదిరించాడు. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన వరలక్ష్మీ ఇంటికి వచ్చి ఇంట్లోనే ఉన్న విషపుగుళికలు తినడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
అనంతరం వరలక్ష్మి పరిస్థితి గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే కడప రిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే వరలక్ష్మి మృతి చెందినట్లు తెలిపారు. గురువారం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.