చంద్రబాబు, లోకేష్ అండతోనే అరాచకాలు: కాల్ మనీపై గంగా భవానీ
హైదరాబాద్: కాల్ మనీ వ్యవహారం సభ్య సమాజం తల దించుకునేలా ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ ముఖ్య అధికార ప్రతినిధి గంగా భవానీ అన్నారు. బుధవారంనాడు ఆమె హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. కాల్ మనీ వ్యవహారంపై ఆమె ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
మహిళలను ఆదుకుంటానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక వారిని వ్యభిచార కూపంలోకి నెడుతున్న దోషులపై చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఆమె అన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడం వల్లనే కాల్ మనీ ఆగడాలు పెరిగాయని ఆమె అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ అండతోనే తెలుగుదేశం పార్టీ నేతలు కాల్ మనీ అరాచకాలకు పాల్పడుతున్నారని గంగా భవానీ వ్యాఖ్యానించారు నిజాయితీగా వ్యవహరిస్తున్న విజయవాడ పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ను ఈ ప్రభుత్వం ఒత్తిడికి గురి చేసిందని ఆమె విమర్శించారు.
కాల్ మనీపై ఇంత వివాదం జరుగుతున్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గానీ, మంత్రులు గానీ ఖండించకపోవడం బాధ్యతారాహిత్యమని ఆమె అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మండలి సభ్యుడు సీ రామచంద్రయ్య బుధవారం లేఖ రాశారు. నవ్యాంధ్ర రాజధాని భూసేకరణకు సంబంధించిన ఫైల్స్ను శాసన సభలో, మండలిలో ప్రవేశ పెట్టాలని అందులో కోరారు.