మగాళ్లు కనిపిస్తే చాలు...తోటల్లోకి పిలుస్తున్నారు:ఆపైన...అంతా నిలువుదోపిడి
ప్రకాశం జిల్లా:అద్దంకిలోని నామ్రోడ్డు అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డాగా మారింది. ఇక్కడ వ్యభిచారం, దోపిడీలు,దాడులు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. అయితే ఇదంతా ప్రధానంగా వ్యభిచారం ముసుగులో జరుగుతుండటం గమనార్హం.
ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనాలను మహిళలు, మహిళల వేషంలో ఉండే ట్రాన్స్ జెండర్లు ఆపి డ్రైవర్లను, యువకులపై వలపువల విసురుతారు. అలా వారిని తోటల్లోకి తీసుకెళ్లి ఆ తరువాత నగదు, బంగారం దోచుకుని నిలువు దోపిడి చేసి పంపిస్తారు. కానీ ఈ విషయం బయటపెడితే తమ పరువే పోతుందని బాధితులు సొమ్ములు పోయినా మిన్నకుంటున్నారు. ఇదీ గత కొన్నేళ్లుగా నామ్ రోడ్డుపై సాగుతున్న తంతు.
రెండు దశాబ్దాల క్రితం ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారి అడ్డాగా వ్యభిచారం యథేచ్ఛగా సాగిపోయేది. అయితే ఆ క్రమంలో రహదారిని ఆనుకుని ఉన్న పలు గ్రామాల్లో మూడు దశాబ్దాల వ్యవధిలో ఎయిడ్స్ వ్యాధి బారిన పడి వందలాది మంది మృతి చెందారు. ఈ క్రమంలో అలెర్టయిన పోలీసులు దశాబ్దకాలంగా హైవేపై ప్రత్యేక నిఘా పెట్టడంతో రమదారి వెంబడి వ్యభిచారం తగ్గుముఖం పట్టింది.
అయితే ఆ తరువాత ఈ జాడ్యం రెండు, మూడు సంవత్సరాల నుంచి నామ్ రోడ్డుకు మారింది. పైగా పోలీసులు కొంచెం నిఘా స్థాయి తగ్గించడంతో ఇటీవలికాలంలో జాతీయ రహదారిపై కూడా కొన్ని ప్రాంతాల్లో మళ్లీ వ్యభిచారం జోరందుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నామ్ రోడ్డు, జాతీయ రహదారులపై అనేక ప్రాంతాల్లో చీకటి పడితే చాలు జన సంచారం ఉండని వివిధ స్థలాల్లో మహిళలు రోడ్డు పైకి వచ్చి వాహనాలు ఆపుతున్నారు. ఈ క్రమంలో లారీ డ్రైవర్ే కాకుండా పలువురు యువకులు ఆ మహిళలను వారి కవ్వింపులను చూసి ఆగిపోతున్నారు. ఆ తర్వాత వారితో పక్కనే ఉండే సుబాబుల్ తోటల్లోకి వెల్లి...ఆ తర్వాత నిలువు దోపిడీకి గురవుతున్నారు.
వీరు సుబాబుల్ తోటల్లోకి వెళ్లగానే అప్పటికే అక్కడ కాపు కాసి ఉండే కొందరు వ్యక్తులు ఈ పురుషులపై దాడి చేసి వారి వద్ద ఉన్న మొత్తం ఫోన్లతో సహా లాక్కొని పంపిస్తున్నారు. ఎదురు తిరిగితే కొట్టి పంపిస్తున్నారు. ఈ విషయం బయటకు చెబితే పరువు పోతుందని ఎవరికి వారే తేలు కుట్టిన దొంగల్లా సైలెంటైపోతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి ప్రధానంగా నామ్ రోడ్డుపై మేదరమెట్ల - అద్దంకి మధ్య బొడ్డువానిపాలెం, కొంగపాడు డొంక ప్రాంతాల్లో, చక్రాయపాలెం-శాంతినగర్ వద్ద, చినకొత్తపల్లి డొంక, వి.కొప్పెరపాడు, ఏల్చూరు-కొమ్మాలపాడు వద్ద రాత్రి సమయాలలో చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అలాగే జాతీయ రహదారిపై వెంకటాపురం, పి.గుడిపాడు, అలవలపాడు క్రాస్ రోడ్డు, బొల్లాపల్లి కాలువ సమీపంలో ఈ మహిళలు కాపు కాసి ఉంటున్నారు. వెంకటాపురం పరిసర ప్రాంతాలలో ఉదయం సమయంలో కూడా రోడ్డు వెంబడి వ్యభిచారం నిర్వహించే మహిళలు తారసపడుతుండటం గమనార్హం. ఆయా ప్రాంతాల్లో సుబాబుల్ తోటలే అడ్డాగా పెద్ద ఎత్తున వ్యభిచారం జరుగుతోంది. ఈ కారణంగా ఆయా గ్రామాల్లో పొలాలకు వెళ్లే మహిళలు కూడా ఇబ్బందిపడే పరస్థితి నెలకొంది. అక్కడ వ్యభిచారం గురించి తెలిసిన లారీ డ్రైవర్లు ఆయా ప్రాంతాల్లో పొలాలకు వెళ్లే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి.
ఇక్కడ గత కొంతకాలంగా జరిగిన ఘటనల గురించి స్థానికులు ఏకరువు పెడుతున్నారు. గత ఏడాది నామ్ రోడ్డులో వి.కొప్పెరపాడుకు చెందిన యువకులు మోటారు సైకిల్పై వెళ్తుండగా చక్రాయపాలెం దాటిన తరువాత ఇద్దరు మహిళలు యాక్సిడెంట్ అయిందని తమ వారికి గాయాలయ్యాయని మోటార్ సైకిల్ ను ఆపారు. వారిని సమీపంలో ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లి జేబులు ఖాళీ చేసి పంపించారు. వెంపరాలకు చెందిన ఓ యువకుడు అద్దంకి నుంచి మోటార్సైకిల్పై వెళ్తుండగా మహిళలను ఎరవేసి పొలాల్లోకి తీసుకెళ్లి నగదును దోచుకున్నారు.
అలాగే కొంగపాడు డొంక వద్ద థర్డ్ జెండర్ మహిళలు లారీని ఆపి, అందులో ఉన్న వారిని నగదును డిమాండ్ చేసి దౌర్జన్యం చేశారు. ఇక రెండు రోజుల క్రితం కూడా ఇక్కడే కొందరు మహిళలు ఒక లారీని ఆపి డ్రైవర్ను పొలాల్లోకి తీసుకెళ్లారు. అతని వద్ద ఉన్న నగదు, బంగారపు ఉంగరం దోచుకున్నారు. ఇలా బయటకు రాకుండా జరుగుతున్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నట్లు సమాచారం. అలాగే అధికారులమని చెప్పి వాహనచోదకులను బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా నామ్ రోడ్డుపై జరుగుతున్నట్లు తెలుస్తోంది. బొల్లాపల్లి వద్ద గత ఏడాది ఎక్కువగా ఇలాంటి దోపిడీలు జరగడంతో పాటు ఏకంగా సివిల్ డ్రస్లో ఉన్న ఒక ఎస్సై పై కూడా దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది.
ఇటీవలి కాలంలో నామ్ రోడ్డు, హై వే రోడ్డుపై హైవేపై పెట్రోలింగ్, పోలీసుల నిఘా బాగా తగ్గడంతో వ్యభిచారంతో పాటు దోపిడీలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రోడ్డుమార్జిన్లో వాహనాలు నిలుపుకొని నిద్రించాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఉందని పలువురు డ్రైవర్లు వాపోతున్నారు. దీంతో రోడ్డు వెంబడి ఉన్న గ్రామాల్లో వాహనాలు నిలిపి నిద్రిస్తున్నారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు నిఘా పెంచి అసాంఘిక కార్యకలాపాలతో పాటు దోపిడీలు నిరోధించాలని వాహనాల డ్రైవర్లు, ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.