రక్త చరిత్ర సినిమాలో చూపించినవన్నీ వాస్తవాలు కాదు: గంగుల హేమలత
అనంతపురం: రక్త చరిత్ర సినిమాలో చూపించినట్లుగా తమ కుటుంబాలకు చెందిన వారి ఇళ్లన్నీ ఎదురెదురుగా ఏమీ లేవని మద్దెలచెర్వు సూరి సోదరి గంగుల హేమలతా రెడ్డి అన్నారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రక్త చరిత్ర సినిమా రెండు భాగాలను తాను చూశానని ఆమె చెప్పారు. కానీ వాస్తవంగా జరిగింది వేరు, ఆ సినిమాలో చూపించింది వేరు అని ఆమె అన్నారు. ఈ సినిమాలో గంగుల కుటుంబం గురించి చూపించినవి అన్నీ వాస్తవాలు కాదన్నారు.
సినిమాకు తగినట్లు కథను మార్చుకున్నారు
సినిమాకు తగినట్లుగా కథను మార్చుకున్నారని గంగుల హేమలతా రెడ్డి తెలిపారు. కానీ ఎక్కడా వాస్తవాలు చూపించలేదని ఆమె వెల్లడించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతంలో రక్త చరిత్ర సినిమాను రెండు పార్టులుగా తీసిన విషయం తెలిసిందే.
అమ్మమ్మ వాళ్లింట్లో పెరిగా
తాను చిన్నప్పటి నుంచి కర్నాటకలోని తన అమ్మమ్మ వాళ్లింట్లో పెరిగానని గంగుల హేమలతా రెడ్డి అన్నారు. పదో తరగతి వరకు అక్కడ చదువుకున్నానని, ఆ తర్వాత ఇంటర్, డిగ్రీ అనంతపురంలో చదివానని చెప్పారు. తన పెదనాన్న గంగుల నారాయణ రెడ్డి కొద్దిగా గుర్తున్నారని, అప్పుడు తనకు ఆరేడేళ్ల వయస్సు ఉండవచ్చునని చెప్పారు.
నా పెదనాన్నకు నేనంటే ఇష్టం
తన తల్లి చెప్పేదానిని బట్టి తన పెదనాన్నకు తాను అంటే ఎంతో ఇష్టమని గంగుల హేమలతా రెడ్డి చెప్పారు. తనకు తెలిసే నాటికి తమ కుటుంబం విడి విడిగా ఉందని, ఇళ్లు కూడా సినిమాలో చూపించినట్లు పక్క పక్కన లేవని చెప్పారు.
స్పష్టంగా చూపించలేదు
రక్త చరిత్ర సినిమాలో గంగుల ఫ్యామిలీ గురించి చూపించినవి అన్నీ వాస్తవాలు అని తాను నమ్మడం లేదని చెప్పారు. సూరి అలా ఎందుకు చేయవలసి వచ్చింది అనేది స్పష్టంగా చూపించలేదని తాను అనుకుంటున్నానని చెప్పారు.