బాబు నేను ఒకేసారి, చిన్నపిల్లలు వారితోనా: అఖిలప్రియపై గంగుల
మాజీ పార్లమెంటు సభ్యులు గంగుల ప్రతాప్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో విజయవాడలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
నంద్యాల: మాజీ పార్లమెంటు సభ్యులు గంగుల ప్రతాప్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో విజయవాడలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
గంగుల Vs భూమా, ఒకే పార్టీలో ఇమిడేనా, అఖిలకు షాకేనా?
టిడిపి తీర్థం
విజయవాడలో నిర్వహించిన హార్టికల్చర్ ఎక్స్పో ఎగ్జిబిషన్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన గంగుల ప్రతాప్ రెడ్డి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీ కండువా కప్పిన చంద్రబాబు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
మేమిద్దరం స్నేహితులం
ఈ సందర్భంగా గంగుల ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను, చంద్రబాబు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చామని, పార్టీలు వేరైనా తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పారు. తన సోదరుడు, వైసిపి నేతతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. కానీ రాజకీయల విషయంలో ఎవరి అభిప్రాయాలు వారివే అన్నారు.
నంద్యాలపై చంద్రబాబుతో చర్చించా
చంద్రబాబు నాయుడు చేస్తోన్న అభివృద్ధి పనులు తనను ఆకర్షించాయని, ఇటీవలే తాను నంద్యాల సమస్యలపై చంద్రబాబుతో చర్చించానని గంగుల అన్నారు. చంద్రబాబు సానుకూలంగా స్పందించారని తెలిపారు.
చిన్నపిల్లలు..
దీంతో తాను టిడిపిలో చేరాలనుకుంటున్నానని చంద్రబాబుకి చెప్పానని, నంద్యాల ప్రాంత అభివృద్ధి కోసం తాము పాటుపడతామన్నారు. తనకు మంత్రి అచ్చెన్నాయుడితో పాటు పలువురు టిడిపి నేతలు మంచి మిత్రులు అన్నారు. తాను తీసుకున్న నిర్ణయంపై ప్రజలు సానుకూలంగా స్పందించాలన్నారు. గతంలో భూమా నాగిరెడ్డితో అభిప్రాయ బేధాలు ఉండేవని, ఇప్పుడు ఆయన లేరని, ఇక చిన్న పిల్లలు అయిన అఖిలప్రియ, బ్రహ్మానంద రెడ్డితో విభేదాలు ఏముంటాయన్నారు.