నా భర్తను మట్టుబెట్టేందుకు కుట్ర: గంగిరెడ్డి భార్య మాళవిక
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి భార్య మాళవిక హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తను ఎన్కౌంటర్ పేరుతో మట్టుబెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. జైల్లో ఉన్న తన భర్తకు రక్లించేలా కడప జైలు నుంచి హైదరాబాదు లేదా తెలంగాణలోని ఏ జైలుకైనా తరలించేలా ఎపి పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరింది.
వ్యాపారవేత్త అయిన తన భర్త గంగిరెడ్డిని రాజకీయ కారణాలతో అన్యాయంగా కేసులో ఇరికించారని మాళవిక పిటిషన్లో చెప్పారు. చంద్రబాబుపై తిరుపతి అలిపిరి వద్ద జరిగిన దాడి కేసులో కూడా తన భర్తను నిందితుడిగా చేర్చారని, అయితే కోర్టు నిర్దోషిగా ప్రకటించిందని ఆమె అన్నది.
చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చిన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. పోలీసులు తన భర్తపై నమోదు చేసిన నేరాలు జరిగిన సమయంలో గంగిరెడ్డి విదేశాల్లో ఉన్నారని, తన భర్తతో పాటు కుటుంబ సభ్యులను కూడా పోలీసులు తప్పుడు కేసులతో వేధిస్తున్నారని ఆయన అన్నారు. ప్రత్యక్ష ఆధారాలు లేకపోవడంతో సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేసులు పెడుతున్నారని ఆమె అన్నారు.
తనకు భర్తకు ప్రాణహాని ఉందని, కోర్టుకు వచ్చే సమయంలో గానీ జైలులో గానీ హతమార్చేందుకు కుట్ర పన్నుతున్నారని కొల్లం మాళవిక ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే తాను గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు మాళవిక తెలిపారు.
చంద్రబాబు చెప్పినట్లే డిజిపి, సిఐడి అదనపు డిజీలు నడుచుకుంటున్నారని, అందులో భాగంగానే మీడియా సమావేశంలో నిర్వహించారని, తన భర్తపై 28 కేసులు ఉన్నట్లు ప్రకటించారని, ఇది సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించడమేనని ఆమె అన్నారు.
ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డిజిపి, కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల ఎస్పీలను, కడప సెంట్రల్ జైలు సూపరింటిండెంట్లను ప్రతివాదులు చేర్చారు. సిఐడి అదనపు డిజి ద్వారకా తిరుమల రావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు.