గుప్పుమంటున్న గంజాయి: చేపల లారీ ముసుగులో దందా.. తెలుగు రాష్ట్రాల్లో రవాణా ఇలా !!
ఏపీ గంజాయి అక్రమ రవాణాకు అడ్డాగా మారిపోయింది. ఒక పక్క కరోనా మహమ్మారితో రాష్ట్రం యుద్ధం చేస్తున్న సమయంలో కూడా గంజాయి అక్రమ రవాణా ఆగటం లేదు .కాదేదీ అక్రమ రవాణాకు అనర్హం అన్న చందంగా గంజాయి స్మగ్లర్లు ఈ సమయంలో కూడా అక్రమ మార్గాల ద్వారా గంజాయి దందా సాగిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్న వారు తాజాగా చేపల లోడుతో వెళ్ళే లారీలో గంజాయి రవాణాకు పూనుకున్నారు. ఇక వీరిని పోలీసులు పట్టుకున్నారు.
చేపల లారీలో గంజాయి అక్రమ రవాణా
కృష్ణా జిల్లాలో జరిపిన వాహన తనిఖీల్లో గంజాయి పట్టుబడింది. కృష్ణా జిల్లాలోని కంకిపాడు గాయత్రీ విహార్ సమీపంలో 290 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆకివీడు నుంచి చేపలలోడుతో విజయవాడ వైపు వెళ్తున్న లారీలో గంజాయిని గుర్తించిన పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ గంజాయి ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తుంది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రెండు కార్లలో ఇటీవల పట్టుబడిన గంజాయి
ఇక మొన్నటికి మొన్న విశాఖ విశాఖ ఏజెన్సీ కొయ్యూరు మండలం చీడిపాలెం వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా రెండు కార్లలో తరలిస్తున్న 110 కేజీల గంజాయి పట్టుబడింది. ఇక దీని విలువ రెండు లక్షల రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం . ఇక గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఇక వారి వద్దనుండి నాలుగు సెల్ ఫోన్లు , రెండు కార్లు సీజ్ చేశామని కొయ్యూరు పోలీసులు చెప్పారు.
తెలంగాణా రాష్ట్రంలోనూ గంజాయి రవాణా
ఇక ఇటు తెలంగాణా రాష్ట్రంలో కూడా గంజాయి రవాణా సాగుతుంది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం నుంచి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు జగిత్యాల సీసీఎస్ పోలీసులు ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపట్నం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఛత్తీస్ గఢ్ నుంచి వస్తున్న లారీని సోదా చేసిన వారు సుమారు 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక ముగ్గురు నిందితులను పట్టుకుని తదుపరి విచారణ నిమిత్తం ధర్మపురి పోలీస్ స్టేషన్ కు అప్పగించినట్లు తెలిపారు.