సరకు రవాణా రంగంలో రాష్ట్రం ముందడుగు:గన్నవరం విమానాశ్రయం నుంచి మొదలైన కార్గో సేవలు
విజయవాడ:రాష్ట్ర సరకు రవాణా రంగం దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్న శుభతరుణం రానే వచ్చింది...వారు ఎంతకాలంగానో నిరీక్షిస్తున్న గన్నవరం నుంచి ఆకాశమార్గంలో కార్గో సేవలు మొదలయ్యాయి.
దీంతో సరకు రవాణా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించినట్లయింది. గన్నవరం విమానాశ్రయం నుంచి బుధవారం ఉదయం మొదటి పార్శిల్ విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లింది. మొదటి రోజే ఉదయం నుంచి రాత్రి వరకూ మొత్తం 12 టన్నుల సరకు దిల్లీ, ముంబయి, చెన్నై మూడు నగరాలకు ఎయిర్ కార్గోలో వెళ్లడం, రావడం జరిగింది.
కార్గో సేవలు...ప్రారంభం
రాష్ట్రం నుంచి డొమెస్టిక్ కార్గో సేవలు ఆరంభమయ్యాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి సరకు రవాణా బుధవారం నుంచే ప్రారంభమయ్యాయి. కార్గో సేవలకు తొలిరోజు ఊహించిన దాని కంటే భారీ స్పందన వచ్చింది. పోస్టల్శాఖకు చెందిన తొలి పార్శిల్ గన్నవరం విమానాశ్రయానికి ఉదయాన్నే చేరుకుంది. దీన్ని ఢిల్లీకి కార్గోలో బుక్ చేసి పంపించారు. ఇటునుంచి వెళ్లింది, అటునుంచి వచ్చింది కలిపి సరుకు 12 టన్నుల వరకూ ఉంది. విజయవాడ నుంచి హైదరాబాద్, ముంబయి, చెన్నై, దిల్లీ, బెంగళూరు, విశాఖ, తిరుపతి, కడప నగరాలకు ప్రస్తుతం కార్గో సేవలు అందిస్తున్నారు.
సేవలు...సామర్థ్యం
ఉదయం 6.30గంటల నుంచి రాత్రి 9.30 వరకూ ఎయిర్ లైన్స్ కార్గో సేవలు అందుబాటులో ఉంటాయి. విమానాశ్రయం నుంచి నిత్యం 52 సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో సరకు రవాణాకు అవకాశం ఉన్న వాటన్నింటిలోనూ ప్రస్తుతం సరకును పంపిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రోజుకు పది టన్నుల సరకును పంపించే సామర్థ్యం ఈ విమాన సర్వీసుల్లో ఉంది. ఇటునుంచి పంపించేందుకు, అటునుంచి తెప్పించేందుకు 20 టన్నుల సామర్థ్యం ఉంది.
ఎలా...బుక్ చేయాలంటే?
గన్నవరం విమానాశ్రయంలోని కార్గో కార్యాలయం వద్దకు సరకును తీసుకెళ్లిన తర్వాత...ఏ నగరానికి పంపించాలనేది చెబితే...విమాన సర్వీసుల వేళలు చెబుతారు. కార్గో సేవలు అందిస్తున్న శ్రీపా లాజిస్టిక్స్ కార్యాలయంలో తొలుత సరకును బుక్ చేసుకోవాలి. దానికి సంబంధించిన సర్వీసు రుసుం చెల్లించాలి. అనంతరం అక్కడే ఉన్న ఎయిర్లైన్స్కు సంబంధించిన కార్యాలయంలో వారు నిర్దేశించిన ధర చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం కార్గో సేవలు అందించే సంస్థ నిర్ధిష్ఠమైన ఒకేరకమైన ధరలు నిర్ణయించింది. ఎయిర్లైన్స్ ధరల్లో మాత్రం ఎయిరిండియా, స్పైస్జెట్, ట్రూజెట్ ధరలు కొద్ది తేడాతో ఉన్నాయి. కొరియర్ సర్వీసు లాగే కార్గోకు కూడా ఇక్కడి నుంచి సరకును పంపించే నగరాన్ని బట్టి రుసుం నిర్ణయించారు.
రుసుం వసూలు...ఇలా
కార్గో సేవల్లో మొత్తం మూడు రకాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ, ప్రత్యేక, పెరిషబుల్ కార్గోకు వేర్వేరు ధరలు వసూలు చేస్తారు. సాధారణ కార్గోలో ఏవైనా పంపించేయొచ్చు. దీని ధర కూడా తక్కువే. ప్రత్యేక, పెరిషబుల్కు ధర ఎక్కువ ఉంటుంది. ఆహారం పాడైపోకుండా త్వరగా చేర్చేందుకు, విలువైన సరకు వంటివి దీనికిందకు వస్తాయి. పాడైపోయే అవకాశం ఉన్న కూరగాయలు, పండ్లు లాంటి వన్నీ వీటి పరిధిలోనికి వస్తాయి. 10 నుంచి 144 కిలోలకు లోపు ఎంత సరకు ఉన్నా ఒకే ధరను కార్గో సంస్థ వసూలు చేస్తోంది. సాధారణ కార్గోకు కనీస ధర రూ.122 చెల్లించాల్సిందే. అంతకు మించితే కిలోకు 83పైసలు వసూలు చేస్తారు.
ప్రత్యేక సర్వీసులు...అదనపు ధరలు
అదే ప్రత్యేక, పెరిషబుల్ కార్గో సర్వీసులకు 144 కిలోల వరకూ కనీస ధర రూ.243. దాటితే కిలోకు రూ.1.66పైసలు చెల్లించాలి. ఇదికాకుండా...ఎక్స్రే తదితర అదనపు ఛార్జీలు తీసుకుంటారు. కార్గో సంస్థకు కాకుండా.. ఎయిర్లైన్స్లో తరలించేందుకు వాటికి అదనంగా ధర చెల్లించాలి. ఎయిరిండియాలో ఢిల్లీకి సరకును పంపించాలంటే కిలోకు రూ.15.25 వరకూ వసూలు చేస్తుంటారు. అదే స్పైస్జెట్, ట్రూజెట్, ఇండిగో.. ఇలా వేటికవే కొద్ది ధరల వ్యత్యాసంతో రుసుం వసూలు చేస్తాయి. అందుబాటులో ఉన్న విమాన సర్వీసును బట్టి కార్గో సేవలను బుక్ చేసుకోవచ్చు.
మొదటి రోజే...అనూహ్య స్పందన...
కార్గో సేవల ప్రారంభం అనంతరం ఎయిర్ పోర్ట్ అధికారులు మాట్లాడుతూ సరకు రవాణా సేవలు బుధవారం నుంచి ప్రారంభించామని...తొలిరోజే అనూహ్య స్పందన వచ్చిందని చెప్పారు. మొత్తం 12 టన్నుల వరకూ సరకు పంపించడం, తీసుకురావడం జరిగింది. మరి కొన్ని రోజుల్లోనే కార్గో సేవలు అనూహ్యంగా పుంజుకుంటాయని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. సరకును దేశంలోని ప్రధాన నగరాలకు అత్యంత వేగంగా తరలించేందుకు ఎయిర్కార్గో ఉపకరించనుందని...మిగతా నగరాలతో పోలిస్తే...తక్కువ ధరకే ఇక్కడ కార్గో సేవలను అందించడం జరుగుతుందన్నారు.