లోకల్ వార్..గన్నవరంలో యార్లగడ్డకు చెక్..వైసీపీ అభ్యర్థుల ఎంపికలో వల్లభనేని వంశీ
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్రాలు అన్నీ ఇన్నీ కావు . ప్రతిపక్ష పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పక్షానికి బాహాటంగానే మద్దతునిస్తూ వై సీపీ గెలుపు కోసం పని చెయ్యటం ఏపీ ప్రజలకు వింతగా అనిపిస్తుంది. జనసేన నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీ బీఫాం ల కమిటీలో సభ్యుడిగా వ్యవహరిస్తూ వై సీపీ కోసం పని చేస్తుంటే తాజాగా అలాంటి సీనే ఇంకొకటి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
వైసీపీ లో చేరకున్నా అనధికారికంగా పని చేస్తున్న వంశీ
టీడీపీ కి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరకుండా అనధికారికంగా వైసీపీ నేతగా వ్యవహరిస్తున్న వల్లభనేని వంశీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కోసం కీలకంగా పని చేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన వైసీపీ అధికారంలోకి వచ్చాక తరువాత రాజకీయ పరిణామాల నేపధ్యంలో టీడీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబును , అలాగే నారా లోకేష్ ను తిట్టిపోశారు. వైసీపీలో చేరతారని అందరూ భావించినా వైసీపీలో చేరాలంటే పదవికి రాజీనామా చెయ్యాల్సి ఉండటంతో పార్టీలో చేరకుండా పార్టీ కోసం అనధికారికంగా పని చేస్తున్నారు వంశీ .
యార్లగడ్డ వెంకట్రావును పక్కన పెట్టి టిక్కెట్ల బాధ్యతలు చూస్తున్న వంశీ
ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజక ఇంచార్జ్ అయిన యార్లగడ్డ వెంకట్రావును పక్కన పెట్టి టిక్కెట్ల బాధ్యతలు మొత్తం వంశీ చూస్తున్నారు. జగన్ కూడా వంశీకి స్థానిక ఎన్నికలలో గెలిపించే బాధ్యతను అప్పగించినట్టు తెలుస్తుంది . ఈ పరిస్థితులలో ఆ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, ఎమ్మెల్యే వంశీ వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్య పాత్ర వహిస్తూ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇక ఈ పరిణామం నచ్చని యార్లగడ్డ వెంకట్రావు ఇంచార్జ్ గా ఉన్నారు కాబట్టి ఆయన పార్టీ కార్యాలయం ఖాళీ చేశారు.
వైసీపీ అభ్యర్థులను సెలెక్ట్ చెయ్యటంలో వల్లభనేని వంశీ బిజీ
వల్లభనేని వంశీ వైసీపీ అభ్యర్థులను సెలెక్ట్ చెయ్యటం , టికెట్లు ఇవ్వటం యార్లగడ్డ అభిమానులుగా ఉన్నవారికి ఏ మాత్రం మింగుడు పడటం లేదు . పార్టీలో చేరకుండానే వల్లభనేని వంశీ పార్టీ మీద పెత్తనం చెలాయించటం , స్థానిక ఎన్నికల్లో కీ రోల్ పోషించటం వంటి పరిణామాలు యార్లగడ్డకు చెక్ పెడుతున్నారనే భావన కలిగిస్తున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ నేత వంశీపై ఓడిపోయిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఆయనకు పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదని, ఇక ఈ దెబ్బతో ఆయన కనుమరుగు కావటం ఖాయమని ప్రచారం జరుగుతుంది .
వైసీపీ కండువా కప్పుకోకుండానే పార్టీలో చక్రం తిప్పుతున్న వంశీ
ఇక వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకించిన యార్లగడ్డ వెంకట్రావును బుజ్జగించటానికి కేడీసీసీ బ్యాంకు చైర్మన్ పదవిని ఇచ్చి సరిపెట్టారన్న ప్రచారం కూడా జరుగుతుంది. స్థానిక ఎన్నికల విషయంలో గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ ప్రాధాన్యత తగ్గటం , వల్లభనేని వంశీ ప్రాధాన్యత పెరగటం స్థానిక ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తుంది. వైసీపీ కండువా కప్పుకోకుండానే వల్లభనేని పార్టీలో చక్రం తిప్పటం గన్నవరం నియోజకవర్గంలో ఆసక్తికర చర్చకు కారణం అవుతుంది.