కులం: హీరో రామ్పై వల్లభనేని వంశీ సీరియస్ కామెంట్స్, చంద్రబాబునూ వదల్లేదు
అమరావతి: రమేష్ ఆస్పత్రి విషయంలో హీరో రామ్ పోతినేని చేసిన ట్వీట్లపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓ వైపు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెడుతూనే.. మరోవైపు హీరో రామ్ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు.
హీరో రామ్ ట్వీట్పై విజయవాడ సీపీ తీవ్ర స్పందన: వారి సమాచారం ఇస్తే రూ. లక్ష నజరానా
చంద్రబాబుతో కమ్మ సామాజిక వర్గానికి ముప్పు..
శుక్రవారం వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడుతూ.. కులం పేరుతు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 13 జిల్లాల్లో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారి సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఆపిందా? అని నిలదీశారు. ‘చంద్రబాబు నాయుడు ఒక్కడే తమ సామాజిక వర్గానికి నాయకుడు కాదు. గతంలో చాలా మంది నాయకులు మా సామాజిక వర్గానికోసం పనిచేశారు. చంద్రబాబుతోనే కమ్మ సామాజిక వర్గానికి ముప్పు. చంద్రబాబుకు ఉన్న సమస్యలన్నింటినీ కులానికి రుద్దుతాడు' అని వల్లభనేని వంశీ దుయ్యబట్టారు.
అమరావతి అంటున్న చంద్రబాబు..
‘ఓటుకు నోటు కేసులో తెలంగాణ(హైదరాబాద్)లో పదేళ్లు ఉండే అవకాశం ఉన్నా..అక్కడ ఉండేలేక ఎమ్మెల్యేలు అందరినీ కట్టుబట్టలతో విజయవాడకు తీసుకొచ్చాడు. ప్రతిసారి అమరావతి అంటున్న చంద్రబాబు మాత్రం.. హైదరాబాద్లో రూ. 300 కోట్లతో ఇళ్లు కట్టుకున్నాడు' అంటూ వంశీ విమర్శలు గుప్పిచారు.
హీరో రామ్ సినిమాలు కమ్మ వాళ్లే చూస్తారా?
ఇక హీరో రామ్ ట్వీట్లపై వంశీ స్పందిస్తూ.. విజయవాడ రమేష్ ఆస్పత్రి గురించి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారంటూ ఆరోపించారు. రామ్ సినిమాలు ఒక్క కమ్మవాళ్లు మాత్రమే చూస్తారా? వేరే వాళ్లు చూడరా? అంటూ ప్రశ్నించారు. వేరే కులం వారిని తన సినిమా చూడవద్దు అని రామ్ చెప్పగలరా? అని నిలదీశారు.
వివాదానికి తెరతీసిన రామ్ కామెంట్స్
విజయవాడ రమేష్ ఆస్పత్రి యాజమాన్యం.. స్వర్ణ ప్యాలెస్ హోటల్లో కోవిడ్ సెంటర్ నిర్వహిస్తుండగా.. ఇటీవల అక్కడ అగ్ని ప్రమాదం జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రమేష్ ఆస్పత్రి, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యం, సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. కాగా, ఆస్పత్రి చీఫ్ రమేష్ కేసు దర్యాప్తు జరుగుతున్న తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రమేష్ ఆస్పత్రి యాజమాన్యానికి మద్దతుగా హీరో రామ్ పలు ట్వీట్లు చేశారు. ఈ వ్యవహారంలో రమేష్ ఆస్పత్రిపై కుట్ర జరిగిందన్నారు. అంతేగాక, స్వర్ణ ప్యాలెస్, రమేష్ ఆస్పత్రి వ్యవహారంలో అసలైన కుట్రదారులకు ఖచ్చితంగా శిక్ష పడుతుందని, చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని రామ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఆ తర్వాత ఇక ఈ వివాదానికి సంబంధించి ఎలాంటి ట్వీట్లు చేయబోనని అన్నారు. అయితే, మరోసారి ట్వీట్ చేశారు. కుల దురాభిమానం కరోనా కంటే ప్రమాదకరంగా మారిందని, దాన్ని అందరూ దూరంగా ఉంచాలని రామ్ కోరారు. అందరూ కలిసిండాలన్నారు.