వాట్సప్ రాజీనామాలు: వంశీ బాటలో అనుచరులు: టీడీపీ ఖాళీ అయినట్టేనా?
విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వరుస దెబ్బలు తగులుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తరువాత.. ఆయన అనుచరులు పార్టీని వీడటానికి సిద్ధపడ్డారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సుమారు నాలుగు మండలాలకు చెందిన టీడీపీ నాయకుల తమ రాజీనామాలను పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపించారు. వంశీకి నైతిక మద్దతు ఇవ్వడానికే తాము రాజీనామాలను చేస్తున్నట్లు వారు వెల్లడించారు. వారంతా వాట్సప్ ద్వారా తమ రాజీనామాలను పంపించినట్లు చెబుతున్నారు.
వంశీ! కేసులకు భయపడి ఇలానా? నీది టీడీపీ డీఎన్ఏ: రంగంలోకి కేశినేని నాని, ఆసక్తికర వ్యాఖ్యలు
అయిదేళ్ల పదవీ కాలాన్ని అయిదు నెలల్లోనే..
వంశీ రాజీనామా వ్యవహారం తెలుగుదేశంలో ప్రకంపనలు రేపింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై అతి తక్కువ మెజారిటీతో విజయం సాధించిన తరువాత వంశీ.. టీడీపీ అధిష్ఠానంతో అంటీ ముట్టనట్టు వ్యవహరించారు. మొదట్లో ఒకట్రెండు సార్లు పార్టీ సమావేశాలకు హాజరయ్యారు. ఆ తరువాత పార్టీ సమావేశాలకు సైతం దూరం అయ్యారు. అప్పట్లోనే వంశీ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీకి చెందిన కృష్ణా జిల్లా సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకెళ్లారు. అయిదేళ్ల పదవీ కాలం ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు వంశీ రాజీనామా చేయడానికి సాహసించకపోవచ్చని భావించారు.
బుజ్జగింపుల్లో చంద్రబాబు..
అనూహ్యంగా వంశీ శాసన సభ సభ్యత్వానికే కాకుండా.. ఏకంగా రాజకీయాల నుంచే వైదొలగుతున్నట్లు ప్రకటించడం టీడీపీలో కాక పుట్టించింది. వంశీతో అనుబంధం ఉన్న విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని, మాజీ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, బోడె ప్రసాద్ లను రంగంలో దింపారు. వంశీని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ.. వంశీ మెత్తబడలేదు.. మెట్టు దిగనూ లేదు. తాను రాజీనామాకే కట్టుబడి ఉన్నానని, తన రాజీనామా లేఖను ఆమోదింపజేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా రాజీనామాను ఆమోదించే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది.
మండలాల్లో టీడీపీ ఖాళీ అవుతుందా?
వంశీ రాజీనామా అనంతరం ఆయన అనుచరులు కూడా అదే బాటలో నడవాలని నిర్ణయించుకున్నారు. సూరంపల్లి, కేసరాపల్లి, వీరపనేని గూడెం, బల్లిపర్రు, బుద్ధవరం, అజ్జంపూడి వంటి మండలాలకు చెందిన పలువురు వంశీ అనుచరులు టీడీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తమను రాజీనామాలు చేయమని వంశీ ఆదేశించ లేదని, తామే స్వచ్ఛందంగా పార్టీని వీడబోతున్నట్లు చెబుతున్నారు. వంశీ వల్లే తాము పార్టీలో కొనసాగుతున్నామని, ఆయన ఏ పార్టీలో చేరితే.. తాము అదే పార్టీకి మద్దతు ఇస్తామని అంటున్నారు. టీడీపీలో కొనసాగాలని అనుకోవట్లేదని కరాఖండిగా తేల్చేస్తున్నారు.