జగన్ ను సైకో అనలేదు- వీడియోలో కామెంట్స్ కరెక్టే ! దుట్టా రామచంద్రరావు క్లారిటీ..
గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ వర్గపోరు నేపథ్యంలో సీఎం జగన్ ను సైకో అన్నట్లు వచ్చిన వార్తల్ని సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు ఇవాళ ఖండించారు.
ఏపీలోని కృష్ణాజిల్లా వైసీపీలో వల్లభనేని వంశీతో సాగుతున్న రాజకీయ పోరులో భాగంగా తాజాగా ప్రత్యర్ది వర్గం నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ గుడి ప్రారంభోత్సవం కార్యక్రమానికి హాజరైన వీరిద్దరూ.. సీఎం జగన్ తో పాటు వంశీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఓ వీడియో బయటికి వచ్చింది. దీనిపై దుట్టా ఇవాళ క్లారిటీ ఇచ్చారు.
హనుమాన్ జంక్షన్ లోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన దుట్టా రామచంద్రరావు.. నిన్న బయటికి వచ్చిన వీడియోలో తాను చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. గుడి ఓపెనింగ్ నిమిత్తం యార్లగడ్డ, తాను కలుసుకున్నామని ఆయన వెల్లడించారు. కొన్ని చానల్లో సీఎం జగన్ సైకో అని మేమిద్దరం అన్నట్లు వార్తలు వస్తున్నాయని, కానీ తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. 40 సంవత్సరాల నుండి తాను డాక్టర్ వృత్తిలో ఉన్నానని దుట్టా తెలిపారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి తనకూ దగ్గర సంబంధం ఉందన్నారు.
తాము చచ్చిపోయే వరకు తమ కుటుంబ సభ్యులు జగన్ తోనే ఉంటామని దుట్టా రామచంద్రరావు వెల్లడించారు.వల్లభనేని వంశీ తో కలిసి ప్రయాణం చేయమని అధిష్టానం చెప్పిందని, వంశీ తో కలిసి నేను ప్రయాణం చెయ్యను అని అధిష్టానానికి చెప్పానని దుట్టా తెలిపారు. వంశీ తో గొడవ పడవద్దని అధిష్టానం తనకు చెప్పిందన్నారు. అందుకేఅధిష్టానం మాటకే కట్టుబడి ఉన్నానన్నారు. యార్లగడ్డ వెంకట్రావు కూడా వైసీపీ పార్టీకి కట్టుబడి ఉన్నాడన్నారుసీఎం జగన్ ని తిట్టే మనస్తత్వం తమది కాదన్నారు. అందరం సరదాగా కూర్చుని మాట్లాడుకునే టైంలో ఎవరు రికార్డ్ చేశారు తెలియదన్నారు. ఆ వీడియోలో అనకూడని మాటలు ఏమీ లేవన్నారు.