కాపు రిజర్వేషన్ తంటా: ఆ మంత్రులు సక్సెస్ అవుతారా? అసలు కేంద్రం ఆమోదిస్తుందా?
హైదరాబాద్/ అమరావతి: 'ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు' అన్నది సామెత. ఇది కాపులు, బీసీల విషయంలో సరిగ్గా వర్తిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకత్వం మాత్రం ఇరు పక్షాల విశ్వాసంతో 2019 ఎన్నికల్లో మళ్లీ గద్దెనెక్కాలని ఆశ పడుతోంది. అందులో భాగంగానే గత అసెంబ్లీ ఎన్నికలు, దానికి ముందు 'వస్తున్న మీ కోసం' యాత్రలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానని ఇచ్చిన హామీలను 'నాటకీయ ఫక్కీ'లో అమలుజేయ పూనుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి నేపథ్యం, కారణం ఏమైనా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను బీసీల జాబితాలో చేరుస్తూ తీసుకున్నచంద్రబాబు నాయుడు సర్కార్ తీసుకున్న నిర్ణయం.. వచ్చే ఎన్నికల్లో ఇటు కాపులు.. అటు బీసీల మద్దతు కూడగట్టే బాధ్యత ఏతావాతా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లోని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలపై పడింది.
Recommended Video
కానీ టీడీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న బీసీ కులాలకు తీవ్ర అన్యాయం చేశారంటూ వివిధ బీసీ సంఘాలు చంద్రబాబుపై ఆగ్రహిస్తున్నాయి. ఇప్పటికే కాపులను బీసీ జాబితాలో చేర్చినందుకు ఉభయ గోదావరి జిల్లాల్లోని బీసీల్లో ఆగ్రహావేశాలు రగిల్చింది. వారు వరుస ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. పలుచోట్ల ఏపీ సీఎం దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు తీరుకు నిరసగా బీసీ సంఘాలు ధర్నాలు, రాస్తారోకో నిర్వహిస్తున్నాయి.
బీసీ నేతగా అచ్చెన్నాయుడు
ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల మంత్రులు గంటా శ్రీనివాసరావు, కింజారపు అచ్చెన్నాయుడు.. కాపు, బీసీ సామాజిక వర్గాలకు నాయకత్వం వహిస్తున్న వారే. కానీ ఈ దఫా ఇరు పక్షాలను తమతో కలుపుకుని వెళ్లాల్సిన గురుతర బాధ్యత గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడుపైనే ఎక్కువగా ఉంది. మూడు జిల్లాల పరిధిలో ‘సైకిల్'ను పరుగులు తీయించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్ ప్రకటించగానే ఇది తమ జాతికి పండుగ రోజని మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియా ముందు గొప్పగా ప్రకటించారు. కానీ దాన్ని ఓట్ల పండుగగా మార్చేందుకు చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఆయన పొరుగున ఉన్న విజయనగరం జిల్లాకు ఇన్చార్జి మంత్రి కూడా.
ఉత్తర భారత రాష్ట్రాల్లో ఇలా రిజర్వేషన్ల కోసం ఆందోళనలు
ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదు. ఒకవేళ కాదూ కూడదంటే కేంద్రం రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. ఇప్పటికే రాజస్థాన్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో గుజ్జర్లు, జాట్లు, పాటిదార్లు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ గెలుపొటములను శాసించే స్థాయికి పాటిదార్లలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేయడం అంటే కేంద్రం తేనెతుట్టెను కదపడం వంటిదే. ఆంధ్రప్రదేశ్ పొరుగునే ఉన్న తెలంగాణ ప్రభుత్వం కూడా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడంతోపాటు ఎస్టీల రిజర్వేషన్ల శాతం పెంచాలని.. అందుకు అనుమతించాలని కేంద్రానికి లేఖ రాసింది కూడా..
అంగబలం గల గంటాకు కాపుల మద్దతు కూడగట్టడం సవాలే
ఇటువంటి తరుణంలో రాజకీయంగా కీలకమైన, అతి సున్నితమైన నిర్ణయం తీసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సాహసిస్తారా? అన్నది అనుమానమే. ఇకపోతే దాదాపుగా రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్న గంటా శ్రీనివాసరావుకు కాపుల మద్దతు దండిగానే ఉన్నదని చెప్తున్నారు. ఆయనతోపాటు, ఆయన అనుచర వర్గం కూడా అరడజను మంది వరకూ ఎమ్మెల్యేలుగా, ఎంపీగా ఉన్నారు. అందునా తెలంగాణ ఏర్పాటు తర్వాత కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి పార్టీలో చేరిన వారందరికీ టిక్కెట్లు ఇప్పించి గెలిపించిన నేపథ్యం టీడీపీది. ఇటు విశాఖపట్నం నగరంతోపాటు జిల్లాలో కాపుల జనాభా అధికమే. పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో వారి ప్రభావం కచ్చితంగా ఉంటుంది. కనుక కూడా ఇకపై కాపులనూ.. వారితోపాటు బీసీలనూ ‘సైకిల్' వెనుక.. అంటే ఆయా సామాజిక వర్గాలను టీడీపీకి అనుకూలంగా మళ్లించాలి. ఇది గంటా శ్రీనివాసరావుకు సవాల్ వంటిదే. బాబు క్యాబినెట్లో ఎందరో కాపు మంత్రులు ఉన్నా ఉత్తరాంధ్ర విషయానికి వస్తే గంటా పేరు ప్రముఖంగానే ఉంటుంది. పైగా ఆయన ఆర్ధికంగా, సామాజికంగా ఇతరుల కంటే కూడా బలవంతుడన్న పేరు సంపాదించుకున్నారు మరి.
బీసీలకు అన్యాయం జరుగనివ్వబోమన్న అచ్చెన్న
ఏపీ సీఎం చంద్రబాబు సైతం బీసీలను బుజ్జగించి.. కాపులతోపాటు కలిపి పార్టీ పక్షాన నడిపించేందుకు మంత్రి గంటా శ్రీనివాసరావును రంగంలోకి దించినట్లుగా తెలుస్తోంది. ఇక, మరో మంత్రి, నోరున్న నేతగా పేరున్న సిక్కోలు నాయకుడు కింజారపు అచ్చెన్పాయుడుకూ ఏపీ సీఎం చంద్ర బాబు అగ్ని పరీక్షే పెట్టారు. కాపులను బీసీలలో చేర్చే తీర్మానంపై మాట్లాడిన అచ్చెన్నాయుడు బీసీలకు ఎటువంటి అన్యాయం జరగబోదని అసెంబ్లీ సాక్షిగా ఢంకా భజాయించి మరీ చెప్పారు. ఇపుడు అదే దూకుడుతో ఆయన వెనుకబడిన జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ రూరల్ జిల్లాలలో లక్షల సంఖ్యలో ఉన్న బీసీలను టీడీపీకి అనుకూలం చేయాల్సిన బాధ్యతను మోయాల్సి వస్తోంది.
బీసీలకు అన్యాయం చేయడం సరి కాదన్న మంత్రి పితాని
ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప వంటి వారు సంబురాలు చేసుకున్నారు. అమలాపురంలో డిప్యూటీ సీఎం చిన రాజప్పకు కాపులు సాదర స్వాగతం పలికారు. మరో మంత్రి పితాని సత్యనారాయణ మెటికలు విరిచారు. బీసీలకు అన్యాయం చేయడం సరి కాదని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కాపులను బీసీలలో చేరుస్తామనగానే ఒక్కసారిగా బీసీలలో అగ్రహం కట్టలు తెంచుకుంది. తమకు వచ్చే అవకాశాలను వారికి పంచి పెడుతున్నారన్న బాధ వారిలో వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్రలో వెలమలు, కాళింగలు, గవరలు, యాదవులు ప్రధానంగా బీసీలు. వీరంతా రాజకీయంగా కాపులతో ఎక్క డిక్కడ విభేదిస్తున్న వారే. ఇపుడు కాపులు సైతం బీసీలుగా మారుతున్న వేళ తెలుగు నాట ప్రత్యేకించి అధికార టీడీపీలో కుల కలహాలు పార్టీలో పెచ్చరిల్లడం ఖాయమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కాపులకు రిజర్వేషన్ల అర్హతే లేదన్న ఎమ్మెల్సీ పిల్లి సుభాష్
టీడీపీకి తొలినుంచి వెన్నుదన్నుగా నిలిచి నికరమైన ఓటు బ్యాంకుగా ఉంటూ వచ్చిన బీసీలు కనుక వ్యతిరేకమైతే సైకిల్ పార్టీ పునాదులు కదిలి పోవడం ఖాయమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా బీసీనేత, వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్రబోస్ స్పందిస్తూ బీసీ రిజర్వేషన్లు పొందేందుకు కాపులకు ఏ విధమైన అర్హత లేదన్నారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలను బీసీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానించి కేంద్రం ఆమోదానికి పంపడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం చాలా కీలకమైనదని, అందుకు లోబడే తీర్మానం చేయాలని సూచించారు. 1982 - 89, 1994 - 2004, 2014 నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలు టీడీపికి కంచు కోటలుగా ఉంటూ వచ్చాయి. ఇపుడు కాపుల రిజర్వేషన్ పుణ్యమాని వాటికి బీటలు వారితే 2019లో టీడీపీ అధికారాన్ని అందుకోవడం కష్టసాధ్యమే అవుతుందన్న విమర్శలు ఉన్నాయి.
బాబు వ్యూహాన్ని వారిద్దరూ అమలు చేస్తారా?
34 సీట్లు గల మూడు జిల్లాల్లో వెనుకబడితే టీడీపీకి నగుబాటే అవుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ముందు చూపుతోనే అటు అచ్చెన్నాయుడు, ఇటు గంటా శ్రీనివాసరావును రంగంలోకి దించారని తెలుస్తోంది. వీరిద్దరితోపాటు మరో సీనియర్ నాయకుడు మంత్రి యనమల రామక్రుష్ణుడు కూడా ఈ కమిటీలో ఉన్నారని సమాచారం. ఇక, కాపులకు రిజర్వేషన్ కల్పించామన్న ప్రచారాన్ని ఎంత ఎక్కువగా క్షేత్ర స్ధాయిలో తీసుకుపోతే అంత ఎక్కువగా ఆ వర్గం మద్దతు టీడీపీకి దక్కుతుందని, ఫలితంగా వచ్చే ఎన్నికలలో కాపులు, బీసీల జోరు సవారీతో టీడీపీ సైకిల్ ఎదురు లేకుండా పరుగులు తీస్తుందన్నది టీడీపీ అధినాయకుని చాణక్య వ్యూహం. ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనలకు తగినట్లు ఈ ఇద్దరు ఉత్తరాంధ్ర మంత్రులూ కార్యక్షేత్రంలోకి దిగి తమ సత్తా చాటుకుంటారా, బ్రేకులు లేకుండా సైకిల్ పార్టీని పరుగులు తీయిస్తారా అన్న సంగతి మున్ముందు వేచి చూడాల్సిందే మరి.
హైకోర్టు ప్లస్ సుప్రీంకోర్టు.. ఆ పై కేంద్రం ఓకే అంటేనే..
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అప్పుడే అమలై పోయిందన్నట్లు వ్యవహరిస్తున్న కాపు, బీసీ నేతలు.. హైకోర్టు, సుప్రీంకోర్టు వైఖరి కూడా తెలిస్తే గానీ అసలు సంగతేమిటన్నది అర్థం కాదు. అదే సంగతి ఇప్పటివరకు ఆందోళన సాగించిన ముద్రగడ పద్మనాభం గుర్తు చేశారు. రాజ్యాంగ బద్ధంగా కాపులకు రిజర్వేషన్ కల్పించేందుకు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని, ఐదు శాతం రిజర్వేషన్ కాదని, పది శాతం కావాలని గట్టిగానే డిమాండ్ చేశారు.పైగా కాపుల పట్ల చంద్రబాబు డ్రామాలు కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అధిక జనాభాగా ఉన్న కాపుల విషయంలో చంద్రబాబు తొలినుండీ అనుచితంగానే ప్రవర్తిస్తురంటూ దుయ్యబట్టారు. ఇదిలావుంటే మరోవైపు మంజునాథ కమీషన్ నివేదిక బయటకు రాకుండానే చంద్రబాబు అదరాబాదరా నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సుప్రీంను ఆశ్రయిస్తామంటున్న బీసీ సంఘాలు
ఇదిలా ఉంటే రిజర్వేషన్లను పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఏపీ సీఎం చంద్రబాబు తన బాధ్యత దులిపేసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తున్నది. ఇటువంటి నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీని కలసి అన్నీ వివరిస్తామని, బీసీలకు జరుగుతున్న అన్యాయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బీసీ నేతలు అంటున్నారు. త్వరలో ఈ విషయమై ప్రధాని నరేంద్రమోదీని కలసి అన్నీ వివరిస్తామని, బీసీలకు జరుగుతున్న అన్యాయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బీసీ నేతలు చెబుతున్నారు. గతంలో సుమారు మూడు కమీషన్లను నియమించినా కాపులకు బీసీ హోదాలో చేరే అర్హత లేదనన్న సంగతి గుర్తు చేస్తున్నారు.