మీ వద్ద సమాచారం, విద్యార్థుల భవిష్యత్తుతో వద్దు: కేసీఆర్కు గంటా, మీడియా ముందే చర్చకు సై
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల సందర్భంగా ఆదివారం నాడు ఏపీ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు తెలంగాణ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని తెలంగాణ ప్రభుత్వానికి హితవు పలికారు.
ఉదయం ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలకు హాజరైన వారిలో 44.2 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురతో పోలిస్తే బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది. ఈ సందర్భంగా గంటా మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని కోరారు. గవర్నర్ సమక్షంలో జరిగిన ఒప్పందాలు అమలు కావడం లేదన్నారు. ఉన్నత విద్యామండలి ఏపీకి రికార్డులు ఇవ్వడం లేదని చెప్పారు.
ఏపీకి చెందిన లక్షల మంది విద్యార్థుల సమాచారం తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉందని, ఉన్నత విద్యా మండలి విషయంలో అసత్య ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఏపీ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై మీడియా సమక్షంలో తాను చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
తెలంగాణ తరఫున ఎవరు వస్తారో తేల్చుకోవాలన్నారు. పదో షెడ్యల్లోని విద్యా సంస్థల విషయంలో తెలంగాణ సర్కారు ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణ సర్కారుకు భయపడి తమ అకౌంట్లను బ్యాంకులు సీజ్ చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఏపీ ఇంటర్ బోర్డ్ తెలిపింది.