పురంధేశ్వరిపై గంటా, రాయల టిపై సాయిప్రతాప్ ఆగ్రహం
రాయల టిపై సాయి ప్రతాప్ ఆగ్రహం
రాయల తెలంగాణ ప్రతిపాదన పైన ఎంపి సాయిప్రతాప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కొంత భాగాన్ని రాయలసీమలో కలిపి శ్రీశైలాన్ని ఇవ్వాలన్నారు. విభజన జరిగితే సీమ ప్రాంతం తీవ్రంగా నష్టపోతుందన్నారు. ఓట్ల కోసమే విభజన అనే అభిప్రాయం అందరిలోను ఉందన్నారు. సీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో సీమాంధ్రను అభివృద్ధి చేస్తే ఆ తర్వాత విభజనకు ఒప్పుకుంటామన్నారు.
సింగపూర్ అంటున్న నేతలకు విజన్ లేదు: శైలజానాథ్
సీమాంధ్రను సింగపూర్ అంటున్న నేతలకు విజన్ లేదని మంత్రి శైలజానాథ్ కేంద్రమంత్రి పనబాక లక్ష్మిని ఉద్దేశించి అన్నారు. తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామన్నారు. కాగా, ఇటీవల పనబాక మాట్లాడుతూ విభజన జరిగాక సీమాంధ్రను సింగపూర్ చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
భద్రాచలం తెలంగాణదే: బలరాం
భద్రాచలం తెలంగాణదేనని కేంద్రమంత్రి బలరాం నాయక్ అన్నారు. ఆయన ఈ రోజు భద్రాచలం బందును ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా దృష్టికి తీసుకు వెళ్లారు. రాయల తెలంగాణపై కేంద్రం, అధిష్టానానిదే నిర్ణయమన్నారు.
భద్రాచలం టిదే: ఖమ్మం జిల్లా టిడిపి
భద్రాచలం తెలంగాణదేనని ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రధాని, జివోఎంకు లేఖ రాశారు. భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమన్నారు. భద్రాచలం విషయంలో ఏమాత్రం తేడా వచ్చిన యువత నక్సలిజం వైపు వెళ్తారన్నారు. తెలంగాణ విషయంలో పేచీ పెట్టేందుకే హైదరాబాద్, భద్రాచలం, మునగాల అంటూ కాంగ్రెసు డ్రామాలు ఆడుతోందని ద్వజమెత్తారు.