అమరావతి వెళ్తే, హైదరాబాద్పై హక్కు మాటేంటి: గంటా, కెసిఆర్తో మాట్లాడ్తా: బాబు
అమరావతి: హైదరాబాద్ నుంచి అమరావతికి ఉద్యోగులు, కార్యాలయాల తరలింపుపై పలువురు మంత్రులు సందేహాలు లేవనెత్తారు. 9, 10 షెడ్యూల్లో అనేక సంస్థలు ఉన్నాయని, వాటి విభజన పూర్తి కాలేదని, వాటిలో భారీ నిధులు ఉన్నాయని, ఆస్తులు, అప్పుల విభజన జరగాల్సి ఉందని మంత్రులు అన్నారు.
ఇవేవీ పట్టించుకోకుండా మన దారిన మనం అక్కడి నుంచి వచ్చేస్తే ఈ ప్రక్రియలో చాలా నష్టం జరుగుతుందని, చాలా మొత్తం కోల్పోతామని, అన్నీ చూసుకొని వస్తే బాగుంటూందేమోనని మంత్రి గంటా చెప్పారు. అన్నీ తరలించుకొని వస్తే హైదరాబాద్ పైన హక్కు కోల్పోతామని, మరి పదేళ్ల సంగతేమిటని ప్రశ్నించారు.
వాటిని వదులుకున్నట్లేనా అన్నారు. అయితే, చాలా సమస్యలు ఉన్నాయని, పరిపాలనా సౌలభ్యం కోసం తరలింపు తప్పదని చంద్రబాబు సమాధానం చెప్పారు. అమరావతి కేంద్రంగా పాలన తప్పనిసరి అని చంద్రబాబు కేబినెట్ భేటీలో స్పష్టం చేశారు.
అదే సమయంలో 2016 ఏప్రిల్లోగా మెజారిటీ ఉద్యోగులను హైదరాబాద్ నుంచి రావాలని, జూన్ 2 లోగా అందరూ రావాల్సిందేనని, ఆ లోపు వారందరికీ ఇక్కడ తాత్కాలిక కార్యాలయాలు, వసతులు సిద్ధం చేస్తామని చంద్రబాబు అన్నారు.
ఈ సందర్భంగా... ఏపీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు హైదరాబాద్లో స్థలాలు ఇచ్చారని, వాటిని ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. సమైక్యాంధ్రప్రదేశ్లో ఆ స్థలాలు ఇచ్చారని, కాబట్టి వాటిని రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని అనుకున్నారు.
ఆ స్థలాల్లో ఇల్లు కట్టుకునేందుకు సహకరించాలని ఉద్యోగులు చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తెలంగాణ సీఎం కేసీఆర్తో అవసరమైతే మాట్లాడతానని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారని తెలుస్తోంది.