దాడి, కొణతాల వస్తే ఓకే, క్యారెక్టర్ ఉంటేనే..: గంటా
విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్ర రావులు తమ పార్టీలోకి వస్తామంటే తాను ఎట్టి పరిస్థితుల్లోను వ్యతిరేకించనని మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు గురువారం విశాఖలో అన్నారు.
వారు వస్తే కనుక, తాను కార్యకర్తలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీలోకి చాలామంది చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. క్యారెక్టర్ ఉన్న వారినే చంద్రబాబు పార్టీలోకి తీసుకుంటారని చెప్పారు.
జాతీయ క్రీడల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ తరఫున బిడ్డింగ్ వేస్తామని చెప్పారు. ఎంసెట్ ఉమ్మడిగా నిర్వహించే విషయమై చర్చిస్తున్నామని చెప్పారు. హైదరాబాదులోని గచ్చిబౌలి తరహాలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను తాము నిర్మిస్తామని గంటా చెప్పారు.
ఇకపై ఏటా విశాఖ ఉత్సవ్
ఇకపై ప్రతి ఏడాదీ డిసెంబర్ నెలలో విశాఖ ఉత్సవ్ని నిర్వహిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. విశాఖ వుడా ఉద్యోగ భవన్లోని మూడవ అంతస్థులో విశాఖ ఉత్సవ్ కోసం ప్రత్యేక కార్యాలయాన్ని జెడ్పీ చైర్మన్ లాలం ప్రారంభించారు.
ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ వచ్చే నెల (జనవరి) 23, 24, 25 తేదీల్లో ఉత్సవ్ ఉంటుందన్నారు. ఉత్సవాలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని, మరుసటిరోజు మరో కేంద్ర మంత్రి అశోక్గజపతిరాజు ముఖ్యఅతిథిగా వస్తారని, చివరి రోజు సీఎం చంద్రబాబునాయుడు హాజరవుతారన్నారు.