నాగార్జున వర్సిటీలోనే ఎందుకిలా: ర్యాగింగ్పై గంటా ఆరా
గంటూరు: నాగార్జున విశ్వవిద్యాలయంలోనే ర్యాంగింగ్ ఎందుకు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు విశ్వవిద్యాలయం అధికారులను ప్రశ్నించారు. విశ్వవిద్యాలయంలో కొన్ని నెలల కిందట ర్యాగింగ్కి బలైన బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఘటన ఇంకా మరువక ముందే సోమవారంనాడు మరో ర్యాగింగ్ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
తాజా ఘటనలో ఐదుగురు విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడినట్టు నిర్ధారణ కావడంతో వారిని సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి గంటా మంగళవారం గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వచ్చారు. సీసీ కెమెరాల్లో రికార్డు అవుతున్న దృశ్యాలను పరిశీలించారు. వర్శిటీలో తాజాగా వెలుగు చూసిన ర్యాగింగ్ కలకలంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
తర్వాత విభాగాధిపతులు, వర్సిటీ అధికారులు, విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాలరెడ్డి, ఐఏఎస్ అధికారి బాలసుబ్రమణ్యం తదితరులతో సమీక్ష నిర్వహించారు. ఇక్కడే ఎందుకు జరుగుతోందంటూ అధికారులను ప్రశ్నించి, భవిష్యత్లో ర్యాగింగ్ అనే మాట ఇక్కడ వినిపించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాగా, నాగార్జున యూనివర్సిటీ ర్యాగింగ్ ఘటనపై ప్రొఫెసర్లు కృష్ణమోహన్, విజయలక్ష్మితో కమిటీని నియమించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాస్రావు తెలిపారు. ర్యాగింగ్ చేసే విద్యార్థులను విద్యకు దూరం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగాలకు దూరంగా ఉంచాలన్న ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. యాంటీ ర్యాగింగ్ కమిటీలలో విద్యార్దులకు చోటు ఉంటుందన్నారు.
ర్యాగింగ్ ఫ్రీ జోన్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్దులకు కౌన్సిలింగ్ తరగతులు నిర్వాహణకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. త్వరలోనే పూర్తిస్దాయి వీసిని నియమిస్తామని చెప్పారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేస్తామన్నారు.