బాబుపై వ్యక్తిగత కక్ష ఉంటే: పురంధేశ్వరికి గంటా హెచ్చరిక, బాషా చేరికపై టిడిపి ఇంఛార్జ్
కడప: కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి పైన మంత్రి గంటా శ్రీనివాస రావు ఆదివారం నాడు మండిపడ్డారు. ఆమెకు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పైన కోపం, వ్యక్తిగత కక్షలు ఉంటే వాటిని వ్యక్తిగతంగానే చూసుకోవాలి ఆయన హితవు పలికారు.
బిజెపి నేతగా, పాలన బాగాలేదని విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. గత బడ్జెట్ సమయంలో రాష్ట్రానికి తక్కువ నిధులు ఇచ్చారని, చేతనైతే కేంద్రం నుంచి మరిన్ని నిధులు రాష్ట్రానికి వచ్చేలా చేయాలని సూచించారు. అభివృద్ధి కోసం కష్టపడుతున్న ప్రభుత్వాన్ని విమర్శిస్తే బాగుండదన్నారు.
ఆయన జగన్ పైన కూడా మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువల గురించి జగన్ మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే సత్తా లేకే జగన్ తమ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూసి వైసిపి ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కుతున్నారన్నారు.
కడప జిల్లాలో రేపు ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేస్తామన్నారు. కడప జిల్లాను పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు గంటా చెప్పారు. వైసిపిలో భవిష్యత్ లేదని ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారన్నారు. ఆపరేషన్ ఆకర్ష్ తెచ్చింది దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వాదనకు బిజెపి నేత, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏపీకి కేంద్రం నిధులివ్వడంలేదన్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆమె సూచించారు.
తమ పార్టీ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పంట బీమా విధానాన్ని సరళీకృతం చేసింది తమ పార్టీయేనని, ఖర్చు చేసిన నిధులకు ఎపి ప్రభుత్వం ప్రమాణపత్రాలు ఇస్తే మరిన్ని నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
ఏ రాష్ట్రానికి కూడా అందించని సాయం కేంద్రం ఎపికి చేస్తోందని పురంధేశ్వరి అన్నారు. రాజధాని వివరమైన నివేదికను కేంద్రానికి ఇవ్వలేదని ఆమె అన్నారు. అన్ని రాష్ట్రాల కన్నా ఎపికే కేంద్రం ఎక్కువ నిధులు ఇస్తోందని ఆమె అన్నారు. దీనికి గంటా కౌంటర్ ఇచ్చారు.
చాంద్ భాషా చేరితే అభ్యంతరం లేదని చెప్పా: కందికుంట ప్రసాద్
కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా తెలుగుదేశం పార్టీలో చేరితో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తాను తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముందే చెప్పానని కదిరి టిడిపి ఇంచార్జ్ కందికుంట ప్రసాద్ ఆదివారం తెలిపారు. ఆయన చేరిక కార్యక్రమంలో తాను ఉండనని ముందే చంద్రబాబుకు చెప్పానని తెలిపారు. ఇక నుంచి పార్టీ కార్యక్రమాల్లోచురుగ్గా పాల్గొంటానని చెప్పారు.