మిమ్మల్నేబర్తరఫ్, మీకు భయం:డిసిఎంకి గంటా కౌంటర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బర్తరఫ్ చేయాలన్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు మంత్రి గంటా శ్రీనివాస రావు సోమవారం కౌంటర్ ఇచ్చారు. దామోదర వ్యాఖ్యలను ఖండించారు. ఇరు ప్రాంతాల బాగోగులు కోరుతున్న కిరణ్ ఎందుకు రాజీనామా చేయాలని, ఎందుకు బర్తరఫ్ చేయాలని ప్రశ్నించారు.
ఓ ప్రాంతం బాగోగులు మాత్రమే చూసుకుంటున్న డిప్యూటి సిఎంనే బర్తరఫ్ చేయాలన్నారు. సభకు పదే పదే ఎందుకు అడ్డు తగులుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ముసాయిదా బిల్లును తిప్పి పంపినా తమకు అభ్యంతరం లేదని చెప్పిన తెలంగాణ ప్రాంత నేతలు ఇప్పుడు సభకు పదే పదే ఎందుకు అడ్డు పడుతున్నారో చప్పాలని ప్రశ్నించారు.
తీర్మానం నెగ్గితే విభజన ఆగుతుందనే భయం: ఏరాసు
సీమాంధ్ర నేతలవి శుంఠలు, దింపుడు కళ్లెం ఆశలు అన్న తెలంగాణ ప్రాంత నేతలు ఇప్పుడు ఓటింగు కోసం ఎందుకు భయపడుతున్నారని మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు. బిల్లు పైన తమ తీర్మానం నెగ్గితే విభజన ఆగుతుందనే భయం వారిలో ఉందన్నారు. అందుకో అడ్డుపడుతున్నారని విమర్శించారు. కాగా, ఇటీవల జైపాల్ రెడ్డి సీమాంధ్ర నేతలపై తీవ్రంగా మండిపడ్డారు.
ఓటింగ్ కోసం పట్టుబడతాం: శైలజానాథ్
బిఏసిలో బిల్లుపై ఓటింగ్ కోసం తాము పట్టుబడతామని మంత్రి శైలజానాథ్ అన్నారు. బిల్లును తిప్పి పంపించాల్సిందేనని చెప్పారు.
ఏ వ్యక్తి, శక్తి: లగడపాటి
తెలుగు జాతిని దేశంలో ఏ వ్యక్తి, శక్తి విడదీయలేదని విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ వేరుగా చెప్పారు. ఇప్పటికైనా సమైక్యాంధ్రకు అందరు పాటు పడాలని కోరారు.