సిఐడీ అదుపులో గంటా సన్నిహితుడు నలంద కిషోర్ .. మరో నేత కూడా ... ఇప్పుడు వారికీ టెన్షన్
ఏపీలో సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతోంది ఏపీ సర్కార్. ఎవరైనా సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారం తప్పుడు వార్తలు వైరల్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని తేల్చి చెప్పి సిఐడిని రంగంలోకి దించింది ఏపీ ప్రభుత్వం. ఇక అందులో భాగంగా తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్, విజయసాయి రెడ్డి పై సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం అవుతున్న తరుణంలో, ఇక ఆ కథనానికి కారణమైన మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సన్నిహితుడు నలంద కిషోర్ ను సిఐడి అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం.
విజనరీ...సొంత ఎమ్మెల్యేలతో ఓటు వేయించుకోలేక బొక్కబోర్లా పడ్డాడేమిటి : విజయసాయి సెటైర్
సోషల్ మీడియాపై ఏపీ సిఐడీ ఉక్కుపాదం
కరోనా వంటి కష్టకాలంలో తప్పుడు పోస్టింగులు పెట్టి, జనాలకు రాంగ్ మెసేజ్ ఇచ్చే వారిపై చర్యలు తీసుకోవాలని భావించిన ఏపీ సర్కార్ అందులో భాగంగా రంగంలోకి దించిన సిఐడి సోషల్ మీడియాలో ప్రభుత్వానికి సంబంధించిన, ప్రభుత్వ బాధ్యత లు నిర్వర్తించే వారిని కించపరిచేలా వస్తున్న వార్తలపై నిఘా పెట్టింది. ఇక ఈ నిఘాలో భాగంగా ఇప్పటికే చాలా మందిపై సిఐడి కేసులు పెట్టింది. ప్రజలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారంటూ గుంటూరుకు చెందిన 66 ఏళ్ల రంగనాయకమ్మపై కూడా సిఐడి కేసు పెట్టింది అంటే ఎంత కఠినంగా సోషల్ మీడియాపై సిఐడి వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
గంటా సన్నిహితుడు నలంద కిషోర్ అరెస్ట్
ఇక తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అత్యంత సన్నిహితుడైన, టీడీపీ నాయకుడైన నలంద కిషోర్ ని కూడా అరెస్టు చేసిన సిఐడి,నలంద కిషోర్ కు మూడు రోజుల క్రితమే నోటీస్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఈరోజు తెల్లవారుజామున సిఐడి పోలీసులు కిషోర్ ను అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అరెస్ట్ అనంతరం రీజనల్ సీఐడీ కార్యాలయానికి ఆయనను తరలించారు. ఒక్క కిషోర్ మాత్రమే కాకుండా సిఐడి పోలీసులు కృష్ణాజిల్లా నందిగామ టిడిపికి చెందిన చిరుమామిళ్ళ కృష్ణ ను కూడా అరెస్టు చేశారని తెలుస్తోంది.
నందిగామ నేత చిరుమామిళ్ళ కృష్ణ అరెస్ట్
సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెట్టినందుకు అర్ధరాత్రి సమయంలో చిరుమామిళ్ళ కృష్ణను అరెస్టు చేశారని సమాచారం. కర్నూలు కోర్టులో కృష్ణని హాజరు పరచనున్నారు అని తెలుస్తుంది. ప్రభుత్వాన్ని గానీ, అధికార పార్టీ నేతలను గానీ కించపరిచేలా పోస్టులు పెడితే సహించేది లేదని తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం సోషల్ మీడియాలో పోస్ట్ ల పై ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
సోషల్ మీడియాకు వార్నింగ్
ఇక ఇటీవల సుప్రీంకోర్టు కూడా సోషల్ మీడియాలో ఇష్టానుసారం తప్పుడు వార్తలు వైరల్ చేయడాన్ని తప్పు పట్టిన నేపథ్యంలో, ఏపీలోని అధికార వైసిపి ఈ వ్యవహారంలో అలర్ట్ అయింది. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ద్వారా తప్పుడు పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి మరీ చుక్కలు
ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో భాగస్వాములై పనిచేసేవారిని కించపరిచే పోస్టులు పెడితే ఐపీసీ సెక్షన్ 124 ఎ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేస్తారు. ఇక అందులో భాగంగా మూడేళ్ల వరకు జీవితఖైదు, జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఇక అంతే కాకుండా కులమతాలు, ప్రాంతాలు, పార్టీలు, భాషల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెడితే ఐపీసీ సెక్షన్ 505 కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేస్తారు. ఇక ఈ నేరం రుజువైతే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.
Recommended Video
ప్రభుత్వం టీడీపీని టార్గెట్ చేసిందని నేతల ఆరోపణలు
అంతేకాదు కరోనా వైరస్ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం చేస్తే అంటువ్యాధుల చట్టం 54 ప్రకారం కేసు నమోదు చేస్తారు. ఏడాది వరకు జైలు ,జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియా వివాదంలో మరికొంత మందిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక అందులో టిడిపి నేతల సన్నిహితులు ఉండడంతో వైసీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అన్న భావన టిడిపి నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలంటే భయపెడుతున్న పరిస్థితి టిడిపి నాయకులకు ఉంది అని చెప్పక తప్పని పరిస్థితి.