ఫలితాలపై స్పందించట్లేదు, తెలంగాణకు మానవత్వం లేదు: గంటా ఆవేదన
విజయవాడ: తెలుగు విశ్వవిద్యాలయం, అంబేడ్కర్ విశ్వవిద్యాలయాల విద్యార్థుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని మంత్రి గంటా శ్రీనివాస్ రావు శనివారం నాడు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఫలితాలను విడుదల చేయాల్సిందిగా తాము లేఖ రాసినప్పటికీ స్పందించడం లేదన్నారు.
ఇంటర్లో తెలుగు భాషను తప్పనిసరి చేస్తాం: చంద్రబాబు
ఇంటర్ మీడియట్ విద్యలో తెలుగు భాషను తప్పనిసరి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడారు.
తెలుగు భాషను బతికించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించుకోవడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. సంస్కృతి, సంప్రదాయ వారసత్వాలను కాపాడుకోవడంలో భాష కీలకమన్నారు.
మాతృభాషను కాపాడుకుంటే ఉనికిని కాపాడుకున్నట్టేనన్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీల్లో ఇతర భాషలను సెకెండ్ లాంగ్వేజ్గా ఎంచుకుంటున్నారని, ఇకపై తెలుగును మాత్రమే ఎంచుకునేలా నిబంధనలు పెడతామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు కీలకమైన స్థానాల్లో ఉన్నారని చంద్రబాబు గుర్తు చేశారు.
జెడ్పీ చైర్మన్ వేతనాలు పెంచిన ఏపీ సర్కార్
ఏపీ ప్రభుత్వం జడ్పీ చైర్మన్ల వేతనాలను రూ.40 వేలకు పెంచింది. శనివారం నాటి కేబినెట్ భేటీలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. జడ్పీటీసీ, ఎంపీపీల వేతనాలను రూ.6 వేలకు పెంచిన ఏపీ ప్రభుత్వం, సర్పంచ్ల వేతనాన్ని రూ.3 వేలకు పెంచింది.