అప్రమత్తమైన గంటా..! పార్టీ మారడం లేదని వివరణ..!!
విశాఖ/హైదరాబాద్ : టీడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. గత రెండు మూడు రోజులుగా తనపై జరుగుతున్న ప్రచారానికి వివరణ ఇచ్చకున్నారు గంటా. రాజ్య సభ సభ్యుల అంశంలో నెలకొన్న సంక్షోభం పార్టీని కుదిపేస్తున్న సందర్బంలో గంటా వివరణ ఇవ్వడం ప్రాముఖ్యతను సంతరించుకొంది. తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలను గంటా శ్రీనివాసరావు స్పందించారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని... టీడీపీలోనే కొనసాగుతానని వివరించారు.
శక్తి పీఠాన్ని దర్శించుకోవడానికే తాను శ్రీలంక వెళ్లానని అన్నారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అంతకుముందు గంటా శ్రీనివాసరావు టీడీపీకి భారీ షాక్ ఇస్తున్నట్టు ప్రచారం జోరుగా జరిగింది. మాజీ మంత్రి, ప్రస్తుత విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మరో 15 మంది ఎమ్మెల్యేలతో కలసి టీడీపీకి గుడ్ బై కొట్టనున్నట్టు వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి.
ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేలతో కలసి గంటా శ్రీనివాసరావు శ్రీలంకలోని కొలంబోలో ఉన్నారని, వారంతా కొలంబో నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీ కండువా కప్పుకోనున్నారని ఊహాగానాలు జోరందుకున్నాయి. దీంతో టీడీపీ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఇప్పటికే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంతో విస్మయానికి గురైన టీడీపీ శ్రేణులు... గంటా సారథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే నిజంగానే బీజేపీలో చేరతారా అని చర్చించుకోవడం మొదలుపెట్టారు.
అదే జరిగితే చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా పోతుందని ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఊహాగానాలపై స్పందించిన గంటా శ్రీనివాసరావు ఉత్కంఠతకు తెర దించారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని వివరణ ఇచ్చారు. ఏపి టీడిపి పార్టీ అద్యక్షుడు కళా వెంకటరావుతో ఫోన్ లో టచ్ లో ఉన్నట్టు శ్రీనివాసరావు చెప్పారు.