జగన్నాటకం సెల్ఫ్గోల్! చారిత్రక తప్పిదం: జగన్మోహన్ రెడ్డిపై గంటా తీవ్ర విమర్శలు
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి విషయంలో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ పోలీసు వ్యవస్థను అపహాస్యం చేసేవిధంగా జగన్ వ్యవహరించారని మండిపడ్డారు.
ఎవరీ శ్రీనివాస్?: జగన్ అభిమానా? టీడీపీ అనుచరుడా? ఈ ఫొటోల సంగతేంటి?
జగన్నాటకం సెల్ఫ్ గోల్ అయ్యింది..
విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి ఘటనపై ఏపీ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వనని జగన్ నిరాకరించడాన్ని మంత్రి తప్పుబట్టారు. దాడి ఘటనలో జగన్నాటకం రక్తికకట్టపోగా సెల్ఫ్ గోల్ అయ్యిందని గంటా ఎద్దేవా చేశారు.
తెలంగాణ పోలీసులకు వాంగ్మూలం ఇస్తారా?
ఏపీ రాజకీయాలు చేసే వ్యక్తి రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని పేర్కొంటూ తెలంగాణ పోలీసులకు వాంగ్మూలం ఇస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయం ఏపీ పోలీసుల ఆత్మగౌరవానికి సంబంధించినదని, జగన్ ఈ విషయంలో చారిత్రక తప్పిదం చేశారని గంటా విమర్శించారు.
వితండవాదం ఎందుకు?
పోలీసులపై నమ్మకం లేకపోతే విచారణ తర్వాత కోర్టులను ఆశ్రయించాలే తప్ప ఈ విధంగా వాంగ్మూలం ఇవ్వనంటూ వితండవాదం చేయడం మంచిది కాదని అన్నారు. అమరావతిలో కలెక్టర్ల సదస్సు, విశాఖలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్, ఫిన్టెక్ ఫెస్టివల్ నుంచి ప్రజల దృష్టిని మరల్చాలనే ప్రయత్నంలో భాగంగా దాడి ఘటనను సృష్టించినట్లు తాను భావిస్తున్నానని గంటా తెలిపారు. గతంలో కూడా భాగస్వామ్య సదస్సు సందర్భంగా ఇలాగే చేశారని మండిపడ్డారు.
ప్రభుత్వంపై ఇలాంటి కుట్రలా?
విశాఖ విమానాశ్రయం సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ దినేశ్ కుమార్ నిందితుడి వద్ద లేఖ గుర్తించిన విషయంతోపాటు దాడి జరిగిన విధానాన్ని ప్రాథమిక నివేదికలో పొందుపర్చారని, ఆ నివేదిక ఆధారంగానే రాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని గంటా తెలిపారు. ఘటన జరిగిన చాలా సేపటి తర్వాత లేఖ బయటికి వచ్చిందని.. టీడీపీ నేతలు, ప్రభుత్వమే దీన్ని సృష్టించారంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానించడాన్ని మంత్రి గంటా ఖండించారు. ఐదేళ్లపాటు పాలించమని ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేసే విధంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ కుట్రపన్నుతున్నారని మంత్రిగంటా శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు.